ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. మోజ్తబా ఖమేనీ చనిపోలేదని తాను భావిస్తున్నానని ట్రంప్ తెలిపారు. అయితే ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు.
కన్జర్వేటివ్ రేడియో హోస్ట్ గ్లెన్ బెక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. “ఆయన చనిపోయారని నేను అనుకోవడం లేదు. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. శరీరంలోని ఎడమ భాగం, చేయి, కాలు.. అన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఆయన చనిపోయారని నేను అనుకోవడం లేదు” అని వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. అనంతరం ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటి నుంచి ఆయన బహిరంగంగా పెద్దగా కనిపించలేదు. మోజ్తబా ఖమేనీ ప్రస్తుత పరిస్థితిని నిర్ధారించేలా ఇటీవల తీసిన స్పష్టమైన ఫొటో, వీడియో లేదా ఆడియో రికార్డులు ఇప్పటివరకు బయటకు రాలేదు. దీంతో ఆయన ఆరోగ్యం, ఆచూకీపై ఇరాన్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇటీవల ఆయన తండ్రి అలీ ఖమేనీకి నిర్వహించిన భారీ సంతాప కార్యక్రమంలోనూ మోజ్తబా కనిపించకపోవడం ఈ అనుమానాలను మరింత పెంచింది. ఈ కార్యక్రమానికి అధికారికంగా ఆయనే హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. కనిపించలేదు. పలువురు సీనియర్ ఇరాన్ అధికారులు కూడా తాము మోజ్తబాను ఇటీవల చూడలేదని చెప్పినట్లు సమాచారం. ఆయన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఏ కేబినెట్ మంత్రి కూడా ఆయనను కలవలేదని ఇరాన్వైర్ నివేదించింది.
మోజ్తబా మరణించారా?
మోజ్తబా ఖమేనీ ఫిబ్రవరి దాడుల్లో మరణించారని లేదా తీవ్రంగా మెదడు గాయాలకు గురయ్యారని కొందరు గుర్తుతెలియని ఇరాన్ అధికారులు పేర్కొన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వాదనలకు ఇప్పటివరకు ఎలాంటి స్వతంత్ర ధ్రువీకరణ లేదు. మరోవైపు మోజ్తబాకు సన్నిహితంగా ఉన్నవారు ఆయన మరణించారన్న వార్తలను ఖండించారు. భద్రతా కారణాల వల్లే ఆయన బహిరంగంగా కనిపించడం లేదని ఇరాన్ అధికారులు చెబుతున్నారు.
మోజ్తబా బహిరంగంగా కనిపించకపోయినప్పటికీ.. ఆయన అధికారాలను కొనసాగిస్తున్నారనే సంకేతాలు కూడా ఉన్నాయి. ఆయన కార్యాలయం నుంచి మతపరమైన తీర్పులు, ఆదేశాలు, నియామకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా తాను సుప్రీం లీడర్తో కొన్ని గంటల పాటు సమావేశమై యుద్ధ పరిస్థితులు, దేశ ఆర్థిక వ్యవస్థపై చర్చించినట్లు తెలిపారు.
ఆగస్టు 24న ఇరాన్ మీడియా మోజ్తబా ఖమేనీ ఒక విద్యా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న వీడియోను కూడా విడుదల చేసింది. అయితే ఆ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో స్పష్టంగా తెలియకపోవడంతో.. దాని ద్వారా ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని స్వతంత్రంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు.
మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై భిన్నమైన కథనాలు వెలువడుతున్న సమయంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఫిబ్రవరి దాడుల్లో మోజ్తబా తీవ్రంగా గాయపడినా బతికే ఉన్నారని ట్రంప్ చెబుతున్నారు. అయితే ఆయన ఇంతకాలంగా బహిరంగంగా ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం లేదు. ఆయన ఆరోగ్యం, ఆచూకీకి సంబంధించి స్వతంత్రంగా ధ్రువీకరించగల తాజా ఆధారాలు కూడా పరిమితంగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా.. అమెరికా నుంచి ఇరాన్పై సైనిక, ఆర్థిక ఒత్తిడి కొనసాగుతోంది. వాషింగ్టన్ మరిన్ని ఆంక్షలను విధిస్తుండగా.. హార్ముజ్ జలసంధి విషయంలోనూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

