హార్ముజ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా సైనిక సాయంతో హార్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసింది. ట్యాంకర్లపై దాడి చేసి వాటిని నిలిపివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికాతో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో హార్ముజ్ జలసంధి ఇంకా మూసివేసే ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రత్యేక అనుమతి లేకుండా ఈ కీలక సముద్ర మార్గం గుండా ప్రయాణించే చమురు ట్యాంకర్లను అనుమతించబోమని పేర్కొంది.
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) విడుదల చేసిన ప్రకటనను స్థానిక మీడియా వెల్లడించింది. అమెరికా సైనిక విమానాల రక్షణలో, అనుమతి లేని మార్గం ద్వారా హార్ముజ్ జలసంధిని దాటేందుకు రెండు చమురు ట్యాంకర్లు ప్రయత్నించాయని ఐఆర్జీసీ ఆరోపించింది. దీంతో ఆ రెండు ట్యాంకర్లపై దాడి చేసి వాటి ప్రయాణాన్ని నిలిపివేసినట్లు తెలిపింది. ఇరాన్ నిబంధనలను పాటించకుండా హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ప్రయత్నించిన ఆయిల్ ట్యాంకర్లపై చర్యలు తీసుకున్నామని ఐఆర్జీసీ పేర్కొంది. రెండు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి వాటిని నిలిపివేశామని వెల్లడించింది. ఈ ఘటన తర్వాత మరో నాలుగు చమురు ట్యాంకర్లు వెంటనే తమ మార్గాన్ని మార్చుకుని.. తిరిగి గతంలో ఉన్న ప్రాంతాలకు వెళ్లిపోయాయని తెలిపింది. అంతకుముందు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలను ఐఆర్జీసీ బెదిరించేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ఆరోపించింది. ఇరాన్ చేస్తున్న ప్రకటనలతో సంబంధం లేకుండా.. ప్రపంచ వాణిజ్య నౌకల రాకపోకలకు ఈ కీలక సముద్ర మార్గం అందుబాటులోనే ఉందని అమెరికా పేర్కొంది.
ఈ నెల ప్రారంభంలో అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైన తర్వాత.. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ మళ్లీ ఆంక్షలు విధించింది. ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి రవాణా రుసుము వసూలు చేసే హక్కు తమకు ఉందని టెహ్రాన్ ప్రకటించింది. అలాగే తమ తీరప్రాంతానికి సమీపంలోని జలమార్గాల ద్వారా మాత్రమే నౌకా రవాణాను అనుమతిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు ఇరాన్కు చెందిన ఓడరేవులపై అమెరికా కూడా నౌకాదళ దిగ్బంధాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి నియంత్రణ అంశం అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలో ప్రధాన వివాదాంశంగా మారింది.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్తో సంబంధాలు ఉన్న పలు సంస్థలపై కొత్త ఆంక్షలు విధించింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి ఐఆర్జీసీ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తోందని అమెరికా ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
పర్షియన్ గల్ఫ్, హిందూ మహాసముద్రాన్ని కలిపే హార్ముజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ జలసంధి గుండానే రవాణా అవుతుంది. చమురుతో పాటు ఇతర కీలక వస్తువుల రవాణాకు కూడా ఈ మార్గం ప్రధాన ఆధారంగా ఉంది. అందుకే హార్ముజ్ జలసంధిపై నియంత్రణ అంశం అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధాన్ని పరిష్కరించే ప్రయత్నాల్లో ప్రధాన అడ్డంకిగా మారింది.
హార్ముజ్ జలసంధిపై కొనసాగుతున్న దిగ్బంధం ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చమురు, సహజవాయువు సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు, గ్యాస్ ధరల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. తాజా ఘటనతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

