Site icon NTV Telugu

Special Force : ఇరాన్ సుప్రీం లీడర్ ను కాపాడుతున్న స్పెషల్ ఫోర్స్

Iran

Iran

ఇరాన్ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితమైన , ఆందోళనకరమైన పరిణామాల మధ్య కొనసాగుతోంది. అమెరికా , ఇజ్రాయెల్ దాడుల భయం, దేశీయంగా పెరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ముస్తబా ఖమేని (Mostafa Khamenei) బాధ్యతలు చేపట్టడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. తన తండ్రి అలీ ఖమేని మరణం తర్వాత అధికారాన్ని హస్తగతం చేసుకున్న ముస్తబాకు ప్రాణహాని పొంచి ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముప్పును ముందే పసిగట్టిన ఇరాన్ ప్రభుత్వం, ఆయన రక్షణ కోసం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన , రహస్యమైన భద్రతా దళాల్లో ఒకటైన ‘నోపో’ (NOPO) ను రంగంలోకి దించింది. పార్సీ భాషలో ‘నిరుయే విజే పాస్దరన్ వెలాయత్’ అని పిలిచే ఈ దళానికి “సుప్రీం లీడర్‌ను రక్షించే ప్రత్యేక దళం” అని అర్థం. ఈ దళం సభ్యులు తల నుండి కాలి వరకు నల్లటి దుస్తులు ధరించి ఉండటం వల్ల వీరిని ‘బ్లాక్ క్లాడ్ స్పెషల్ ఫోర్స్’ అని పిలుస్తారు. వీరు కనిపిస్తే చాలు ఇరాన్ ప్రజలు వణికిపోతారంటేనే వీరి క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Easy Making : పిల్లలు ఇష్టపడే క్రీమీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే.. పంచదార లేదు, క్రీమ్ లేదు.. కేవలం ఖర్బుజా పండుతో..!

1991లో ఏర్పాటైన ఈ నోపో దళం ఇరాన్ పోలీస్ వ్యవస్థలో అత్యంత శిక్షణ పొందిన ఎలైట్ యూనిట్. పేరుకు ఇది బందీల విముక్తి దళంగా కనిపించినప్పటికీ, దీని అసలు లక్ష్యం సుప్రీం లీడర్‌ను కంటికి రెప్పలా కాపాడటమే. ఇరాన్ అధికారిక సైన్యం లేదా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కంటే కూడా ఈ దళం అత్యంత ప్రమాదకరమైనదిగా , క్రూరమైనదిగా పేరు పొందింది. గతంలో జరిగిన మాసా అమిని నిరసనలను , ఇతర విద్యార్థి ఆందోళనలను అత్యంత దారుణంగా అణచివేసింది ఈ నోపో దళమే. వీరిపై అనేక మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం వీరిపైనే పూర్తి నమ్మకాన్ని ఉంచింది. మార్చి 8న ముస్తబా ఖమేని సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండే ఈ కట్టుదిట్టమైన భద్రతా వలయం పరిధిలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి నేరుగా మాట్లాడకుండా, నోపో దళం పహారాలో ఒక రహస్య ప్రాంతం నుండి తన పాలనను కొనసాగిస్తున్నారు.

ముస్తబా ఖమేని ఎంపిక వెనుక ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ యొక్క పక్కా వ్యూహం దాగి ఉంది. తన తండ్రి లాగే ముస్తబా కూడా కఠినమైన ఇస్లామిక్ విధానాలకు మద్దతు ఇస్తారని , సైన్యం చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉంటారని వారు భావించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం ఆరు నోపో బ్రిగేడ్లు మాత్రమే ఉండగా, అందులో నాలుగు రాజధాని టెహరాన్‌లోనే కేంద్రీకృతమై ముస్తబా రక్షణను పర్యవేక్షిస్తున్నాయి. అమెరికా , ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ వంటి దాడుల భయం ఉన్నప్పటికీ, ఈ ప్రత్యేక దళం తన ప్రాణాలకు రక్షణగా నిలుస్తుందని ముస్తబా భావిస్తున్నారు. ఈ విధంగా అటు అంతర్జాతీయ యుద్ధ భయాలు, ఇటు అంతర్గత తిరుగుబాట్ల మధ్య ఇరాన్ కొత్త అధినేత తన పాలనను అత్యంత ప్రమాదకరమైన భద్రతా వలయం మధ్య కొనసాగిస్తున్నారు.

ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

Exit mobile version