అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు, డెమోక్రటిక్ పార్టీ నేత ఇల్హాన్ ఒమర్ మరోసారి భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ (IAMC) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. భారత్ ప్రస్తుతం ‘‘జెనోసైడ్ (జాతి నిర్మూలన) 8వ దశలో ఉంది.’’ అని ఆరోపించారు. జూన్ 7న జరిగిన ప్రసంగానికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోమాలియా మూలాలు ఉన్న ఆమె కాంగ్రెస్ సభ్యురాలిగా ఉంది. మొదటి నుంచి పాకిస్థాన్కు మద్దతుగా.. భారత్పై విషం కక్కుతూ ఉంటుంది. తాజాగా మరోసారి అక్కసు వెళ్లగక్కింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
అమెరికాలో వలసదారులు, ముస్లింలపై పెరుగుతున్న వివక్ష నేపథ్యంలో జరిగిన కార్యక్రమంలో ఒమర్ మాట్లాడుతూ.. ‘‘భారత్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇది కేవలం మోడీ ప్రభుత్వ చర్యల వల్ల మాత్రమే కాదు.. సమాజంలో కూడా వ్యవస్థాగతంగా మారుతోంది.’’ అని వ్యాఖ్యానించారు.
ఇల్హాన్ ఒమర్ ప్రస్తావించిన ‘‘జెనోసైడ్ 10 దశలు’’ అనే సిద్ధాంతాన్ని అమెరికన్ న్యాయవేత్త గ్రెగరీ స్టాంటన్ రూపొందించారు. ఇందులో 8వ దశను ‘పర్సిక్యూషన్’ (వేధింపులు, హింస)గా పేర్కొంటారు. ఈ దశలో ఒక నిర్దిష్ట వర్గంపై ప్రభుత్వ మద్దతుతో హక్కుల ఉల్లంఘనలు, బలవంతపు స్థానచలనం, ఆస్తుల స్వాధీనం, వివక్ష వంటి చర్యలు జరుగుతాయని స్టాంటన్ వివరిస్తారు.
ఇల్హాన్ ఒమర్ వ్యాఖ్యలను భారత అనుకూల వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మైనారిటీల పరిస్థితిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల వ్యాఖ్యానించారు. ‘‘భారత్ ప్రపంచంలోనే మైనారిటీలకు అత్యంత సురక్షితమైన, సమగ్రత కలిగిన దేశాల్లో ఒకటి. పొరుగు దేశాల్లో మైనారిటీలు వేధింపులకు గురై భారత్లో ఆశ్రయం పొందుతున్నారు.’’ అని రిజిజు పేర్కొన్నారు.
భారత్లో స్వాతంత్ర్యం సమయంలో మైనారిటీల జనాభా సుమారు 11 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 20 శాతానికి పైగా పెరిగిందని విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ఇటీవల పేర్కొన్నారు. మైనారిటీల జనాభా నిరంతరం పెరుగుతున్న దేశం భారత్ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు.
సోమాలియా మూలాలు కలిగిన ఇల్హాన్ ఒమర్ గతంలో కూడా భారత్పై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ భారత్ను లక్ష్యంగా చేసుకున్నారు. పాకిస్థాన్కు అనుకూల వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు కూడా ఆమెపై ఉన్నాయి. ఆమె పాల్గొన్న కార్యక్రమంలో అమెరికాలోని మిన్నెసోటా అటార్నీ జనరల్ కీత్ ఎల్లిసన్, మిన్నెసోటా సెనేట్ మెజారిటీ లీడర్ ఎరిన్ మర్ఫీ, రిపబ్లికన్ సెనేటర్ జిమ్ అబెల్లర్ తదితరులు కూడా పాల్గొన్నారు. భారత్లో మైనారిటీల పరిస్థితిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఇల్హాన్ ఒమర్ చేసిన ‘జెనోసైడ్ 8వ దశ’ వ్యాఖ్యలు మరోసారి భారత్-అమెరికా రాజకీయ చర్చల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

