ఇజ్రాయెల్, లెబనాన్లోని హెజ్బొల్లాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రూప్ సీనియర్ కమాండర్ మహమ్మద్ నామేహ్ నజీర్ను వైమానిక దాడిలో ఇజ్రాయెల్ హతమార్చింది. దీనికి ప్రతీకారంగా ఆ దేశ సైనిక స్థావరాలే లక్ష్యంగా 200కు పైగా రాకెట్లు, 20కిపైగా ఆత్మాహుతి డ్రోన్లు ప్రయోగించినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. గాజాలో పోరు ప్రారంభమైన తర్వాత ఈ గ్రూపు జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇదొకటి. లెబనాన్ భూభాగం నుంచి కొన్ని రాకెట్లు ఇజ్రాయెల్లోకి ప్రవేశించాయని, చాలా వాటిని కూల్చేసినట్లు టెల్అవీవ్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Minister Satyakumar Yadav: ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు
ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. హెజ్బొల్లా దాడుల అనంతరం ఇజ్రాయెల్ సైన్యం కూడా దక్షిణ లెబనాన్ ప్రాంతంపై విరుచుకుపడింది. రామ్యెహ్, హూలా పట్టణాల్లోని ఆ గ్రూపు మిలిటరీ నిర్మాణాలపై పెద్ద ఎత్తున దాడులు జరిపినట్లు వెల్లడించింది. హూలాపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందినట్లు లెబనాన్ వార్తా సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్ 7న హమాస్ విధ్వంసం సృష్టించిన తర్వాత.. ఇజ్రాయెల్ పెద్దఎత్తున ప్రతి దాడులకు దిగుతోంది. హమాస్కు మద్దతిస్తున్న హెజ్బొల్లా ఉగ్రవాదులనూ లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ గ్రూపునకు ఆర్థికంగా, ఆయుధపరంగానూ ఇరాన్ సాయం చేస్తోంది.