హార్ముజ్ విషయంలో గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధి భవిష్యత్తుపై ఇరాన్తో చర్చలు జరిపే అంశాన్ని గల్ఫ్ దేశాలు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇరాన్కు సందేశం పంపినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు, యెమెన్లో హౌతీల దూకుడు, కీలక సముద్ర మార్గాల్లో అంతరాయాలు ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలతో పాటు ప్రపంచ చమురు మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్తో చర్చలకు గల్ఫ్ దేశాలు సిద్ధమవుతున్నట్లు కథనాలు వస్తున్నాయి.
సోమవారం సమావేశం జరిగే అవకాశం
ఆరు దేశాలతో కూడిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) వచ్చే వారం ఇరాన్ అధికారులతో సమావేశం నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వ్యక్తులు తెలిపారు. యుద్ధం ప్రారంభమైన ఆరు నెలలకు పైగా కాలం తర్వాత ఇరాన్తో గల్ఫ్ దేశాల ప్రతినిధులు కలిసి సమావేశం కావడం ఇదే తొలిసారి కావచ్చు. ఒమన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సోమవారం దక్షిణ ఒమన్లోని సలాలాలో GCC దేశాల విదేశాంగ మంత్రులు, ఇరాన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించే యోచన ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సమావేశం ఇంకా ఖరారు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సౌదీ మద్దతు ఉన్న బలగాలకు, ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న హౌతీలకు మధ్య యెమెన్లో తీవ్రత పెరగడం సమావేశ ప్రణాళికలకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని పేర్కొన్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఒమన్ సహా GCCలోని అన్ని దేశాలు సమావేశానికి హాజరవుతాయా లేదా అన్నది కూడా స్పష్టంగా తెలియడం లేదు.
ఇరాన్ ప్రకటన
గల్ఫ్ పొరుగు దేశాలతో సోమవారం సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. హార్ముజ్ జలసంధిపై ఇరాన్-ఒమన్ మధ్య జరుగుతున్న చర్చల ఫలితాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇరాన్తో పాటు ఇరాక్ కూడా పాల్గొంటుందని బఘాయీ శుక్రవారం టెలిగ్రామ్లో వెల్లడించారు.
హౌతీల పట్టు పెరుగుతుందా?
ఇదే సమయంలో యెమెన్లోని హౌతీలు వ్యూహాత్మకమైన బాబ్ అల్-మందబ్ జలసంధికి సమీపంలోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాల వైపు ముందుకు సాగుతున్నట్లు సమాచారం. దీంతో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంపై హౌతీల పట్టు మరింత పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ హౌతీల దాడుల కారణంగా ఎర్ర సముద్రంలో నౌకాయానానికి, చమురు మార్కెట్లకు అంతరాయాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి పరిస్థితి నేపథ్యంలో బాబ్ అల్-మందబ్లోనూ అంతరాయాలు ఏర్పడితే ప్రపంచ ఇంధన మార్కెట్లపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
సౌదీ చమురు ఎగుమతులపై ప్రభావం
హార్ముజ్ జలసంధి మూసివేతతో ఇప్పటికే సౌదీ అరేబియా తన చమురు ఎగుమతుల్లో కొంత భాగాన్ని పశ్చిమ తీరంలోని ఎగుమతి టెర్మినళ్లకు పైప్లైన్ల ద్వారా తరలిస్తోంది. బాబ్ అల్-మందబ్ ప్రాంతంలోనూ నౌకాయానానికి తీవ్ర అంతరాయం ఏర్పడితే సౌదీ అరేబియాపై మరింత ఒత్తిడి పెరగవచ్చని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇదే సమయంలో హౌతీలు సౌదీ అరేబియాలోని నైరుతి ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కొన్ని ఇంధన మౌలిక వసతులు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో సౌదీ అరేబియా ఈ ఘర్షణలో మరింతగా లాగబడే ప్రమాదం ఉందనే ఆందోళన నెలకొంది.
హార్ముజ్పై నియంత్రణ వదులుకోని ఇరాన్
హార్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగాల్సిందేనని ఇరాన్ స్పష్టం చేస్తోంది. సముద్ర రవాణాను నిర్వహించేందుకు ఒక విధివిధానాన్ని రూపొందించే అంశంపై ఒమన్తో ఇరాన్ కొన్ని వారాలుగా చర్చలు జరుపుతోంది. ఈ ప్రతిపాదనలో హార్ముజ్ గుండా ప్రయాణించే నౌకల నుంచి రుసుము వసూలు చేసే అంశం కూడా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే అమెరికా, గల్ఫ్ దేశాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తాత్కాలిక ఒప్పందం ద్వారా నౌకాయానం కొంత మేర పునరుద్ధరించేందుకు GCC దేశాలు అంగీకరిస్తాయా లేదా అన్నది స్పష్టంగా లేదు.
చమురు ధరలకు మళ్లీ షాక్?
అమెరికా-ఇరాన్ యుద్ధానికి సమీప కాలంలో ముగింపు కనిపించకపోవడంతో ఈ వారం చమురు ధరలు భారీగా పెరిగాయి. అమెరికాలో డీజిల్ ధర తొలిసారి గ్యాలన్కు 6 డాలర్లను దాటింది. దీంతో ఇంధన ధరల ఆధారిత ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఈ వారం భారీగా పెరిగే దిశగా సాగుతోంది. శుక్రవారం మాత్రం 3 శాతానికి పైగా తగ్గి బ్యారెల్కు సుమారు 104 డాలర్ల వద్ద ట్రేడైంది. ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగంపై పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ హెచ్చరించింది.
నెలల తరబడి యుద్ధం కొనసాగే అవకాశం?
హార్ముజ్ జలసంధిపై నియంత్రణ విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ ప్రస్తుతం ఒక రకమైన ప్రతిష్టంభనకు చేరుకున్నట్లు సమాచారం. ఇరువైపులా దాడులు కొనసాగుతున్నప్పటికీ వాటి తీవ్రత తక్కువగా ఉందని తెలుస్తోంది. ఈ యుద్ధం మరికొన్ని నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కొనసాగే అవకాశాన్ని ఇరాన్, అమెరికా అంచనా వేస్తున్నట్లు బ్లూమ్బర్గ్ నివేదించింది. చర్చలు తిరిగి ప్రారంభమయ్యేలా పరస్పర రాయితీలు ఇచ్చేందుకు ఇరుదేశాలూ సిద్ధంగా లేవని పేర్కొంది.
హార్ముజ్లో నౌకల రాకపోకలు ఎలా ఉన్నాయి?
ఫిబ్రవరి చివరిలో అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు ప్రారంభించిన తర్వాత హార్ముజ్ జలసంధి దాదాపుగా మూసుకుపోయింది. నౌకలకు స్వేచ్ఛగా మార్గం కల్పించేందుకు అమెరికా నౌకాదళ దిగ్బంధనంతో ఇరాన్పై ఒత్తిడి తెస్తోంది. అయితే గత రెండు నెలల్లో కొన్ని నౌకలు హార్ముజ్ గుండా ప్రయాణిస్తున్నాయి. ఎక్కువగా రాత్రివేళల్లో రహస్యంగా ప్రయాణిస్తున్న ఈ నౌకలకు అమెరికా సైనిక రక్షణ కల్పిస్తున్నట్లు సమాచారం. తమ లొకేషన్ను గుర్తించే ట్రాన్స్పాండర్లను కూడా కొన్ని నౌకలు ఆఫ్ చేస్తున్నాయి. అయినప్పటికీ ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడుల ముప్పు కొనసాగుతోంది.
గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం
సౌదీ అరేబియా, యూఏఈ తమ ముడి చమురు ఎగుమతుల్లో కొంత భాగాన్ని పైప్లైన్ల ద్వారా హార్ముజ్కు ప్రత్యామ్నాయ మార్గాల్లో తరలిస్తున్నాయి. అయినప్పటికీ హార్ముజ్లో రవాణా అంతరాయం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. ఈ ప్రాంతానికి వచ్చే పెట్టుబడిదారులు, పర్యాటకుల సంఖ్యపై కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా ఖతార్ రెండో త్రైమాసికంలో దాదాపు పదేళ్లలోనే అత్యధిక స్థాయి ఆర్థిక లోటును నమోదు చేసింది. ఇదే సమయంలో సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ కూడా అదే కాలంలో కుదించుకుపోయినట్లు సమాచారం.

