Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..

Pakistan

Pakistan

యూకేలో చిన్నారులపై అత్యాచారం, బాలల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న రుఖ్సార్ అహ్మద్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) ఎన్నికల్లో విజయం సాధించాడు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పార్టీ నుంచి ఆయన గెలుపొందడం విమర్శలకు తావిస్తోంది. 62 ఏళ్ల రుఖ్సార్ అహ్మద్‌ను 2024 జూలై 18న మాంచెస్టర్ విమానాశ్రయంలో యూకే పోలీసులు అరెస్టు చేశారు. 1990లలో మాంచెస్టర్‌లోని రషోల్మ్ ప్రాంతంలో చిన్నారులపై అత్యాచారం, లైంగిక దోపిడీ, అక్రమ రవాణాలో పాల్గొన్నారనే ఆరోపణలపై ఆయనను విచారించారు. ప్రస్తుతం అతను బెయిల్‌పై ఉన్నాడు.

జూలైలో పోలీసుల విచారణకు హాజరుకావాలని ఆదేశించినప్పటికీ, ఆరోగ్య కారణాలు చెబుతూ రుఖ్సార్ హాజరుకాలేదు. అయితే, ఇదే సమయంలో పీఓకే లోని మీర్‌పూర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. వచ్చే 6 వారాల్లో ఆయన యూకే పోలీసుల ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఒక వేళ హాజరుకాకపోతే అరెస్ట్ వారెంట్ లేదా, ఎక్స్‌ట్రడిషన్(అప్పగింత) ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చిన్న వయసులో తమపై అత్యాచారం చేసి, లైంగిక అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఇద్దరు మహిళలు రుఖ్సార్ అహ్మద్‌పై ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. యూకేలోని మాంచెస్టర్ ప్రాంతంలో రుఖ్సార్ పాకిస్తానీ కమ్యూనిటీలో ప్రభావవంతమైన నేతగా ఉన్నాడు.

యూకేలో ‘‘గ్రూమింగ్ గ్యాంగ్’’ కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో రుఖ్సార్ అహ్మద్ విషయం చర్చనీయాంశంగా మారింది. యూకేలో గత కొన్ని ఏళ్లుగా బ్రిటిష్ మైనర్ బాలికలపై పాకిస్తానీ మూలానికి చెందిన గ్యాంగులు అత్యాచారానికి పాల్పడి, వారిని లైంగిక అక్రమ రవాణా చేశారు. ఉత్తర ఇంగ్లాండ్ లోని కొన్ని ప్రాంతాల్లోని బాలికలను లక్ష్యంగా చేసుకుని ఈ లైంగిక అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. 2014లో ప్రొఫెసర్ అలెక్సిస్ జే నివేదిక ప్రకారం, రోదర్‌హామ్ ప్రాంతంలో 1997 నుంచి 2013 మధ్య కనీసం 1,400 మందికి పైగా చిన్నారులు లైంగిక దోపిడీకి గురైనట్లు వెల్లడైంది.