Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా 2020లో సంచలనంగా మారిన ఫ్రెంచ్ మహిళ సామూహిక అత్యాచార ఘటనలో నిందితులకు ఉరిశిక్ష పడింది. లాహోర్-సియాల్కోట్ మోటర్వేపై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరు నిందితుల్ని లాహోర్ హైకోర్టు దోషులుగా నిర్ధారించింది, మరణశిక్ష విధించింది. ఈ తీర్పును బుధవారం బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎక్స్లో ప్రశంసించారు.
పాక్లో వివాదంగా గ్యాంగ్ రేప్ కేసు:
2020లో జరిగిన ఈ కేసు ఆ సమయంలో పాకిస్తాన్లో తీవ్ర సంచలనంగా మారింది. పాకిస్తానీ మూలాలు ఉన్న 32 ఏళ్ల ఫ్రెంచ్ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి పంజాబ్ ప్రావిన్స్లోని లాహోర్-సియాల్కోట్ మోటర్వేపై వెళ్తున్న సమయంలో ఆమె కారులోని పెట్రోల్ అయిపోవడంతో ఆ కుటుంబం రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇద్దరు సాయుధులు వాహనంలోకి ఎక్కి, మహిళను దోచుకుని, సమీప పొలాల్లోకి లాక్కెళ్లి, ఆమె పిల్లల ముందే తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశారు. ఈ రేప్ కేసు పాకిస్తాన్ రాజకీయాలను కుదిపేసింది. హక్కుల సంఘాలు, ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
మరణశిక్షను సమర్థించిన హైకోర్టు:
దోషులుగా తేలిన అబిద్ అలీ అలియాస్ మల్హి మరియు షఫ్కత్ అలీ అలియాస్ బగ్గా దాఖలు చేసిన అప్పీళ్లను లాహోర్ హైకోర్టు బుధవారం కొట్టేసింది. ట్రయల్ కోర్టు వేసిన మరణశిక్షను సమర్థించింది. జస్టిస్ సయ్యద్ షాబాజ్ అలీ రిజ్వీ, జస్టిస్ తారిఖ్ మెహమూద్ బజ్వాలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం కింది కోర్టు తీర్పును మార్చేందుకు అంగీకరించలేదు. మార్చి 2021లో లాహోర్ లోని ఉగ్రవాది నిరోధక కోర్టు ఇద్దరికి మరణశిక్ష విధించింది. మరణశిక్షతో పాటు కోర్టు పలు నేరాలకు గానూ యావజ్జీవం, ఇతర జైలు శిక్షల్ని విధించింది.
పాక్ను ప్రశంసించిన ఎలాన్ మస్క్:
స్పెస్ ఎక్స్ అధినేత, బిలయనీర్ ఎలాన్ మస్క్ పాక్ కోర్టు తీర్పును ప్రశంసించారు. ఎక్స్లో స్పందిస్తూ.. ఈ తీర్పును సానుకూల ముందడుగుగా అభివర్ణించారు. ‘‘శభాష్ పాకిస్తాన్. వెస్ట్రన్ దేశాల్లో మేము చేయాల్సింది ఇదే’’ అంటూ మస్క్ పోస్ట్ చేశారు. పలు సందర్భాల్లో అత్యాచార ఘటనలపై ఎలాన్ మస్క్ స్పందించారు. బ్రిటన్లో బాలికను టార్గెట్ చేస్తున్న ‘‘పాకిస్తాన్ గ్రూమింగ్ ముఠా’’ అరాచకాలపై ప్రధాని కీర్ స్టార్మర్ను తీవ్రంగా విమర్శించారు.
