NTV Telugu Site icon

రావత్‌ మరణం పై విషం వెళ్లగక్కిన చైనా

హెలికాప్టర్‌ ప్రమాదంపై ఎగతాళి వ్యాఖ్యలు
చైనా కనీస మానవత్వం మరిచిపోయి మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. సంయమనంతో స్పందించాల్సిన సందర్భంలో అవాకులు చెవాకులు పేలింది. చీఫ్‌ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌రావత్‌ ప్రయాణించిన హెలికాప్టర్‌ ప్రమాదానికి గురికావడం పై చైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. భారత సైన్యానికి క్రమశిక్షణ లేదని, పోరాట సన్నద్ధత లేదని వ్యాఖ్యానించింది. భారత సైన్యం ఆధునికీకరణకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని వ్యాఖ్యానించింది. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ ఈ కథనాన్ని ప్రచురించింది. క్రమశిక్షణ రాహిత్య సంస్కృతికి భారతీయ సైన్యం పెట్టింది పేరు అని ఎగతాళి చేసింది. ప్రామాణిక నిర్వహణ విధానాలను భారతీయ దళాలు పాటించబోవని పేర్కొంది.

2013లో ఓ జలాలంతర్గమిలో పేలుడు జరిగిందని,2019లో ఓ విమాన వాహక నౌకలో అగ్ని ప్రమాదం సంభవించిందని, వీటన్నింటికీ కారణాలు మానవ తప్పిదాలేనని వ్యాఖ్యానించింది. రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ప్రమాదం నివారించదగినదే చెప్తూ వాతావరణం మెరుగయ్యే వరకు ప్రయాణాన్ని వాయిదా వేయడం ఫైలట్‌ మరింత జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంది.గ్రౌండ్‌ మెయింటెనెన్స్‌ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉందని, వీటిలో ఏది పాటించినా ఈ ప్రమాదం జరిగేది కాదని పేర్కొంది. ఈ ప్రమాదం వల్ల భారత సైన్యానికి పోరాట సన్నద్ధత లేదని మరోసారి తేటతెల్లమయిందని పేర్కొంది. చైనా పై వ్యతిరేకత వ్యక్తం చేసే అత్యున్నత స్థాయి వ్యక్తి మరణించినా చైనా పట్ల భారతదేశ దూకుడు వైఖరి మారే అవకాశం లేదని చైనా విశ్లేషకులు చెబుతున్నారని పేర్కొంది.

రష్యాలో తయారైన ఎంఐ-17 సిరీస్‌ హెలికాప్టర్లను ఇతర దేశాల్లో కూడా విస్తృతంగా వాడుతున్నారు. ఈ సాధారణ సమస్య యావత్‌ భారత్‌ సైన్యానికి ఉందని వ్యాఖ్యానించింది. ఒక వేళ నిజంగా పోరాటం ప్రారంభమైతే చైనా సైన్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉండబోదని పేర్కొంది. కాగా, చైనాకు తైవాన్‌, భారత్‌ దేశాలతో ఘర్షణ, వివాదాలు ఉన్నాయి. జనరల్‌ రావత్‌ మాదిరిగానే తైవాలన్‌ మిలటరీ చీఫ్‌ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ జనరల్‌ షెన్‌ యి మింగ్‌(62) కూడా గతేడాది జనవరిలో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు.