భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో టర్కీలో భయాందోళనలు మొదలయ్యాయా? టర్కీ మీడియా, నిపుణులు హడలెత్తిపోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టర్కీ ఎందుకు భయపడుతోంది? అసలేం జరిగింది? విషయం తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
భారత్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులతో గ్రీస్ కీలక రక్షణ ఒప్పందం చేసుకునేందుకు సిద్ధపడుతోందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో టర్కీలో భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా గ్రీస్.. భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసే అవకాశంపై టర్కీ మీడియా, రక్షణ నిపుణుల్లో జోరుగా చర్చ సాగుతోంది.
అయితే ఈ రక్షణ ఒప్పందంపై భారత్, గ్రీస్ లేదా సైప్రస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. తూర్పు మెడిటరేనియన్ ప్రాంతంలో భారతీయ క్షిపణి వ్యవస్థలు ప్రవేశించే అవకాశం ఉందన్న ఊహాగానాలు టర్కీకి ఆందోళన కలిగిస్తున్నాయి.
టర్కీ ఆందోళనకు కారణమేంటి?
టర్కీకి చెందిన రక్షణ ప్రచురణ సంస్థ “టర్డెఫ్” నివేదిక ప్రకారం.. బ్రహ్మోస్ క్షిపణులపై గ్రీస్ ఆసక్తి చూపుతోందన్న వార్తలు టర్కీ వ్యూహకర్తల మధ్య తీవ్ర చర్చకు దారితీశాయి. ఏజియన్ సముద్రం, తూర్పు మెడిటరేనియన్ ప్రాంతాల్లో సముద్ర సరిహద్దులు, ఇంధన వనరుల అన్వేషణ, సైనిక మోహరింపుల అంశాల్లో టర్కీ-గ్రీస్ మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో గ్రీస్ తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత్ తయారు చేసిన దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థలను పరిశీలిస్తోందన్న వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం.. ప్రత్యక్ష కొనుగోలుకు సంబంధించిన దౌత్య, చట్టపరమైన సమస్యలను తప్పించుకోవడానికి గ్రీస్.. సైప్రస్ ద్వారా భారత క్షిపణులను పొందే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోందని ప్రచారం జరుగుతోంది.
భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. భూమి, సముద్రం, గగనతలం నుంచి ప్రయోగించే సామర్థ్యం దీనికి ఉంది. అత్యంత వేగం, కచ్చితత్వం, దీర్ఘశ్రేణి దాడి సామర్థ్యాల కారణంగా బ్రహ్మోస్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. భారత్ కూడా రక్షణ ఎగుమతులపై దృష్టి పెంచడంతో ఈ క్షిపణి కీలక ఎగుమతి ఆయుధంగా మారింది.
టర్కీ రక్షణ విశ్లేషకుడు అర్దాన్ జెంటుర్క్ ప్రకారం.. భారత్-గ్రీస్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడితే తూర్పు మెడిటరేనియన్ ప్రాంతంలో సైనిక సమీకరణాలు మారే అవకాశం ఉందని పేర్కొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. భారత్ అభివృద్ధి చేస్తున్న దీర్ఘశ్రేణి భూదాడి క్షిపణి వ్యవస్థలు కూడా టర్కీకి ఆందోళన కలిగిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా భారతీయ క్షిపణులు తూర్పు మెడిటరేనియన్ ప్రాంతంలో మోహరించబడితే.. టర్కీ కీలక వ్యూహాత్మక మౌలిక సదుపాయాలకు ముప్పు ఏర్పడే అవకాశముందని టర్కీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
టర్కీ-పాకిస్థాన్ సంబంధాల ప్రభావం
టర్కీ మీడియాలో వస్తున్న చర్చల ప్రకారం.. టర్కీ-పాకిస్థాన్ మధ్య సన్నిహిత సంబంధాలు కూడా ఈ అంశంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా కాశ్మీర్ అంశంపై టర్కీ తరచూ పాకిస్థాన్కు మద్దతు ప్రకటించడం భారత్తో సంబంధాల్లో ప్రభావం చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా భారత్.. గ్రీస్ వంటి దేశాలతో రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తోందన్న అభిప్రాయం టర్కీ వ్యూహకర్తల్లో వ్యక్తమవుతోంది.
అలాగే సైప్రస్ అంశం కూడా టర్కీ ఆందోళనలను పెంచుతోంది. భారతీయ క్షిపణులు, డ్రోన్ వ్యవస్థలపై సైప్రస్ ఆసక్తి చూపుతోందన్న వార్తలు టర్కీకి మరింత అసౌకర్యంగా మారాయి. సైప్రస్ ద్వీపం విభజన, ఉత్తర సైప్రస్లో టర్కీ సైనిక ఉనికి వంటి అంశాల కారణంగా అక్కడ భారతీయ ఆయుధ వ్యవస్థలు ప్రవేశిస్తే ప్రాంతీయ సైనిక సమీకరణాలపై ప్రభావం పడే అవకాశముందని టర్కీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే భారత్, గ్రీస్ లేదా సైప్రస్ ఇప్పటివరకు బ్రహ్మోస్ లేదా ఇతర భారతీయ దీర్ఘశ్రేణి ఆయుధాల కొనుగోలుపై అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ భారత రక్షణ ఎగుమతులు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఇప్పుడు దక్షిణాసియాకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యూహాత్మక సమీకరణాలపై ప్రభావం చూపుతున్నాయన్న చర్చ అంతర్జాతీయంగా జోరందుకుంది.
