Asim Munir: అసిమ్ మునీర్‌కు కీలక బాధ్యతలు.. మతలబు ఏంటో..!?

  • పాక్, సౌదీ, టర్కీ కలిసి ‘ఇస్లామిక్ నాటో’ కూటమి
  • అసిమ్ మునీర్‌కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు ప్లాన్
  • అంతర్జాతీయ స్థాయిలో ప్రణాళిక
Asim Munir (1)

Asim Munir (1)

ఇటీవలే పాకిస్థాన్, సౌదీ, టర్కీ కలిసి ‘ఇస్లామిక్ నాటో’ కూటమిగా ఏర్పడ్డాయి. మూడు దేశాలు సంతకాలు కూడా చేశాయి. ఒక దేశంపై ఎవరైనా దాడి చేస్తే.. ఆ శత్రువు మూడు దేశాలకు శత్రువుగా భావించి దాడి చేయడమే ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం.

తాజాగా ఈ కూటమికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌‌కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మూడు దేశాల మధ్య ఇటీవల కుదిరిన సైనిక ఒప్పందంలో భాగంగా రక్షణ మంత్రులు, విదేశాంగ మంత్రులతో పాటు ఆయా దేశాల సైనికాధిపతులతో కూడిన వ్యూహాత్మక వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మునీర్‌కు కీలక పాత్ర?

పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య ఇటీవల కుదిరిన సైనిక ఒప్పందం నేపథ్యంలో టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం కీలక ప్రకటన చేసింది. మూడు దేశాల రక్షణ మంత్రులు, విదేశాంగ మంత్రులు, చీఫ్స్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లేదా ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కమాండర్లతో కూడిన రాజకీయ, సైనిక సమన్వయ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఫీల్డ్ మార్షల్ హోదాలో ఉన్నారు. మూడు దేశాల సైనికాధిపతులకు కూటమి నిర్ణయాత్మక వ్యవస్థలో అధికారిక స్థానం కల్పించనుండటంతో.. మునీర్‌కు కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. అయితే ప్రస్తుతం ‘ఇస్లామిక్ నాటో కమాండర్’ పేరుతో ప్రత్యేక పదవి ఏర్పాటు చేసినట్లు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ఈ ఒప్పందంపై టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. మక్కా ఒప్పందం సాంకేతికంగా నాటోలోని ఆర్టికల్-5 తరహాలో ఉంటుందని తెలిపారు. నాటో ఆర్టికల్-5 ప్రకారం ఒక సభ్య దేశంపై దాడిని అన్ని సభ్య దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. కూటమి నిర్వహణకు నాటో వ్యవస్థల తరహాలో మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు సౌదీ అరేబియాలో జనరల్ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఫిదాన్ వెల్లడించారు. తాజాగా టర్కీ రక్షణ శాఖ ప్రకటనతో సైనికాధిపతులకు కూడా ఈ కూటమి పాలనా వ్యవస్థలో అధికారిక స్థానం ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఎందుకీ ప్రాధాన్యం?

మూడు దేశాల మధ్య ఏర్పడుతున్న ఈ సైనిక భాగస్వామ్యంలో పాకిస్థాన్‌కు పెద్ద సంఖ్యలో సైనిక బలగాలు, అనుభవజ్ఞులైన సైనిక వ్యవస్థ, రక్షణ ఉత్పత్తి సామర్థ్యం, అణ్వాయుధ సామర్థ్యం వంటి బలాలు ఉన్నాయి. 2026 గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ గణాంకాలను ఉటంకిస్తూ అల్ జజీరా తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లో సుమారు 6.60 లక్షల క్రియాశీల సైనిక సిబ్బంది ఉన్నారు. టర్కీలో సుమారు 4.81 లక్షలు, సౌదీ అరేబియాలో సుమారు 2.47 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. మూడు దేశాలను కలిపితే దాదాపు 14 లక్షల మంది క్రియాశీల సైనిక బలం ఉంటుంది. పాకిస్థాన్ దగ్గర సుమారు 1,397 సైనిక విమానాలు, 2,677 ట్యాంకులు ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. మూడు దేశాలకు కలిపి 3,400కుపైగా విమానాలు, సుమారు 6,000 ట్యాంకులు, 344 నౌకాదళ వనరులు ఉన్నాయి.

ఈ కూటమిలో ఒక్కో దేశం ఒక్కో రకమైన బలాన్ని అందించనుంది. పాకిస్థాన్ భారీ సైనిక మానవ వనరులు, సుదీర్ఘ సైనిక అనుభవం, రక్షణ రంగ సామర్థ్యంతో పాటు అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉంది. టర్కీ అధునాతన రక్షణ పరిశ్రమ, డ్రోన్లు, క్షిపణులు, సెన్సర్లు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, నౌకాదళ వ్యవస్థలతో పాటు నాటో అనుభవాన్ని తీసుకురానుంది. సౌదీ అరేబియా భారీ ఆర్థిక వనరులు, వ్యూహాత్మక భౌగోళిక స్థానం, మౌలిక సదుపాయాలను అందించగలదు. 2026లో సౌదీ రక్షణ వ్యయం సుమారు 63.9 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. ఇది టర్కీ రక్షణ వ్యయం 51.4 బిలియన్ డాలర్లు, పాకిస్థాన్ రక్షణ వ్యయం 9.1 బిలియన్ డాలర్ల కంటే చాలా ఎక్కువ.

ఈ కూటమి ద్వారా అసిమ్ మునీర్‌కు పశ్చిమాసియా, మధ్యప్రాచ్య వ్యవహారాల్లో మరింత ప్రభావం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభంలో అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించేందుకు కూడా మునీర్ ప్రయత్నిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. పాకిస్థాన్‌ను ‘ప్రాంతీయ స్థిరీకరణ శక్తి’గా చూపించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషణలు ఉన్నాయి.

దక్షిణాసియా విశ్లేషకుడు మైఖేల్ కుగెల్‌మన్ అభిప్రాయం ప్రకారం.. ఈ ఒప్పందం ద్వారా మధ్యప్రాచ్యంలో పాకిస్థాన్ ప్రభావం పెరగవచ్చు. అయితే సౌదీ అరేబియా లేదా టర్కీకి సంబంధించిన ప్రతి యుద్ధంలో పాకిస్థాన్ తప్పనిసరిగా పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావించడం సరికాదని ఆయన విశ్లేషించారు.

భారత్ విషయంలో చిక్కులు?

మూడు దేశాల ఒప్పందంలోని ‘ఒకరిపై దాడి అందరిపై దాడి’ అనే నిబంధన నాటో ఆర్టికల్-5ను గుర్తు చేస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో పాకిస్థాన్-భారత్ మధ్య సైనిక ఘర్షణ జరిగితే సౌదీ అరేబియా నేరుగా పాకిస్థాన్ తరఫున యుద్ధంలోకి దిగే అవకాశం తక్కువగా ఉండొచ్చని కుగెల్‌మన్ పేర్కొన్నారు. దీనికి భారత్‌తో సౌదీకి ఉన్న సన్నిహిత సంబంధాలు కారణమని వివరించారు. టర్కీ పాకిస్థాన్‌కు సైనికంగా మద్దతు ఇచ్చే అవకాశం కనిపించినప్పటికీ.. భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవాలని అంకారా కూడా ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా అణ్వాయుధ సామర్థ్యం ఉన్న భారత్, పాకిస్థాన్ మధ్య వివాదంలో నేరుగా చిక్కుకోవడం టర్కీకి కూడా ప్రయోజనకరం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

అందువల్ల ఈ కూటమి పాకిస్థాన్‌కు తక్షణ సైనిక జోక్యానికి హామీ ఇవ్వడం కంటే దౌత్యపరమైన రక్షణ, ప్రాంతీయ ప్రభావాన్ని పెంచే వేదికగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. భవిష్యత్తులో ఏదైనా సంక్షోభం తలెత్తితే కొత్త మిత్రదేశాలతో ఉన్న కట్టుబాట్లు, అమెరికా ఒత్తిడి, పాకిస్థాన్ సొంత వ్యూహాత్మక ప్రయోజనాల మధ్య అసిమ్ మునీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారనుంది.