ఉత్తర నైజీరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలి 100 మంది మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. ఉత్తర జిగావా రాష్ట్రంలో రహదారిపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. అయితే సమీపంలో ఉన్న స్థానికులకు ఈ సమాచారం తెలిసింది. రోడ్డుపై పడిన ఇంధనాన్ని సేకరించే పనిలో ఉండగా హఠాత్తుగా మంటలు అంటుకుని ట్యాంకర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల ఎప్పుడంటే..?
మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో హైవేపై బోల్తా పడింది. ప్రజలు పెట్రోల్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ట్యాంకర్కు దూరంగా ఉండమని ప్రజలను హెచ్చరించినప్పటికీ ఎవరూ వినిపించుకోలేదని, ఒక్కసారిగా మంటలు ఎగబడటంతో భారీగా ప్రాణనష్టం జరిగిందని అధికారులు చెప్పారు.
ఇది కూడా చదవండి: Shabbir Ali : గత పదేళ్ల లో మీరేం చేశారో గుర్తుకు తెచ్చుకోండి