Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్న ముగ్గురు కుమారులు.. మొజ్తబా గైర్హాజరుకు కారణమేంటి?

  • కొనసాగుతున్న ఖమేనీ అంత్యక్రియలు
  • లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులు
  • అంత్యక్రియల్లో పాల్గొన్న ముగ్గురు కుమారులు
  • మొజ్తబా గైర్హాజరుపై సర్వత్రా చర్చ
Iran

Iran

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. అయితే ఆయన వారసుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మాత్రం గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టెహ్రాన్‌లో జరిగిన అంత్యక్రియల ప్రార్థనల్లో ఖమేనీ ముగ్గురు కుమారులు పాల్గొన్నారు. కానీ మొజ్తబా మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన ఆరోగ్యం, భద్రతపై మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి.

టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ గ్రాండ్ మోసల్లాలో జరిగిన అంత్యక్రియల ప్రార్థనల్లో అలీ ఖమేనీ కుమారులు మోస్తఫా ఖమేనీ, మసూద్ ఖమేనీ, మేయ్‌సమ్ ఖమేనీ తమ తండ్రి శవపేటిక వెనుక నిలబడి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఎస్మాయిల్ ఖానీతో పాటు పలువురు ఉన్నత రాజకీయ, సైనిక నాయకులు హాజరయ్యారు. అంత్యక్రియల సందర్భంగా మసూద్ ఖమేనీ భావోద్వేగానికి గురైన దృశ్యాలు రాష్ట్ర టెలివిజన్‌లో ప్రసారమయ్యాయి. అలీ ఖమేనీ జాతీయ పతాకంతో కప్పిన శవపేటిక పక్కనే ఆయన కోడలు, 14 నెలల మనవరాలి శవపేటికలను కూడా ఉంచారు.

అయితే అలీ ఖమేనీ ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో మరణించిన అనంతరం మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. ప్రస్తుతం జరుగుతున్న అంత్యక్రియల్లోనైనా పాల్గొంటారా అనే అంశంపై ఇరాన్ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గత వారం అంత్యక్రియల కమిటీ చీఫ్ అలీ అక్బర్ పూర్జమ్‌షిదియన్ మాట్లాడుతూ.. మొజ్తబా పాల్గొనాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా సుప్రీం లీడర్ కార్యాలయమే తీసుకుంటుందని తెలిపారు. అంతేకాదు అదే దాడిలో మరణించిన తన భార్య జహ్రా హద్దాద్-అదెల్ స్మారక కార్యక్రమానికీ మొజ్తబా హాజరుకాకపోవడం కూడా అనుమానాలకు తావిచ్చింది.

భద్రతా కారణాలేనా? గాయాలయ్యాయా?

ఖమేనీ కుటుంబ నివాసంపై జరిగిన దాడిలో మొజ్తబా ఖమేనీ గాయపడినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఆయనకు కాళ్లకు తీవ్ర గాయాలు, ముఖంపై గాయాలయ్యాయని ప్రచారం జరిగినప్పటికీ, శాశ్వత గాయాలయ్యాయన్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు. మోస్తఫా ఖమేనీ భార్యకు సోదరుడైన మహ్మద్ హుస్సేన్ ఖోష్వఘ్త్ మాట్లాడుతూ.. భద్రతా సలహాదారులు మొజ్తబాకు ‘‘స్వరాన్ని కూడా బయటకు వినిపించకుండా పూర్తిగా గోప్యంగా ఉండాలని.’’ సూచించారని తెలిపారు. అలాగే ఇజ్రాయెల్ నుంచి భద్రతా ముప్పు ఉన్నందున ఆయన బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని భద్రతా బృందం సూచించినట్లు కూడా సమాచారం.

అలీ ఖమేనీ అంత్యక్రియలను ఇరాన్ ప్రభుత్వం పలుదశల్లో నిర్వహిస్తోంది. టెహ్రాన్‌లో ప్రార్థనల అనంతరం శవపేటికను పలు నగరాల మీదుగా మష్హాద్‌లోని ఇమామ్ రెజా పవిత్ర స్థలానికి తరలించి జూలై 9న ఖననం చేయనున్నారు. మొజ్తబా ఖమేనీ ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోయినా.. భద్రతా పరిస్థితులు అనుకూలిస్తే కనీసం మష్హాద్‌లో జరిగే ఖనన కార్యక్రమానికి హాజరై తన తండ్రికి చివరి ప్రార్థనలు చేసే అవకాశముందని దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆయన హాజరుపై ఇరాన్‌లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి నెలకొంది.