NTV Telugu Site icon

China Covid: చైనాలో కరోనా విలయ తాండవం.. రోజుకి 9 వేల మరణాలు

China Covid Deaths

China Covid Deaths

China Covid: కరోనా కారణంగా చైనా అతలాకుతలం అవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా అక్కడ వేలల్లో కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. కరోనా ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి అక్కడ కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బ్రిటన్‌కు చెందిన డాటా రీసెర్చ్ సంస్థ ఎయిర్‌ఫినిటీ కొన్ని సంచలన విషయాల్ని రివీల్ చేసింది. డ్రాగన్ కంట్రీలో రోజుకు సుమారు 9 వేల మంది కరోనా వైరస్ కారణంగా మృతి చెందుతున్నారని తన నివేదికలో పేర్కొంది. చైనా ప్రభుత్వం వాస్తవ గణాంకాల్ని బయటకు చెప్పకపోవడం, మీడియా కూడా మౌనం పాటిస్తుండటంతో.. ఈ ఎయిర్‌ఫినిటీ సంస్థ అక్కడి కరోనా పరిస్థితిని రికార్డ్ చేస్తూ, తాజాగా ఈ నివేదికను బయటపెట్టింది. అక్కడ అంచనాలకు మించి రెట్టింపు స్థాయిలో మరణాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది.

Gas Cylinder Price: న్యూ ఇయర్ వేళ బాంబ్ పేల్చిన కేంద్రం.. గ్యాస్ సిలిండర్ ధర పెంపు

చైనాలో కరోనా ఆంక్షలు ఎత్తివేయకముందే.. వివిధ ప్రావిన్స్‌ల నుంచి కరోనా తీవ్రతను రికార్డ్ చేస్తున్నామని, ఆ అందిన సమాచారం మేరకు ఈ గణాంకాలు వెల్లడించినట్టు ఎయిర్‌ఫినిటీ సంస్థ పేర్కొంటోంది. ఇతర దేశాల్లో కరోనా ఆంక్షలు ఎత్తివేశాక నమోదైన కేసుల వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకుని.. చైనా పరిస్థితులపై ఈ సంస్థ ఓ నమూనా రూపొందించింది. ఒక్క డిసెంబరు నెలలోనే చైనాలో లక్షకు పైగా మరణాలు సంభవించాయని ఆ నివేదికలో పేర్కొంది. కేసుల సంఖ్య 18.6 మిలియన్లు దాటిందని.. జనవరి 23 కల్లా చైనాలో గరిష్ఠంగా రోజుకు 3.7 మిలియన్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక రోజువారి మరణాల సంఖ్య 25 వేలకు ఎగబాకొచ్చని అంచనా వేసింది. జనవరి 23 నాటికి చైనాలో 5.84 లక్షల మరణాలు సంభవించొచ్చని పేర్కొంది. అయితే.. చైనా మాత్రం డిసెంబర్ 30వ తేదీన తమ దేశంలో కేవలం ఒక్కరు మాత్రమే కొవిడ్‌తో మరణించినట్టు ప్రకటించడం గమనార్హం.

NTR30: అఫీషియల్ – తారక్ ఫ్యాన్స్‌కి ఒకటి గుడ్.. మరొకటి బ్యాడ్ న్యూస్

చైనా అధికారిక లెక్కల ప్రకారం.. 2020 నుంచి ఇప్పటివరకూ కేవలం 5247 కరోనా మరణాలే సంభవించాయి. తమ దేశ ప్రతిష్ట దెబ్బతినకూడదనే చైనా ఇలా తప్పుడు సమాచారం అందిస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా మరణాలను చైనా ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. అందుకే.. వాస్తవిక గణాంకాలను వెల్లడించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చైనా ప్రభుత్వాన్ని కోరింది. కోవిడ్‌ పరిస్థితులపై నిర్ధిష్టమైన సమాచారాన్ని క్రమం తప్పకుండా అందించాలని సూచించింది.