అగ్రరాజ్యం అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఏటీ అండ్ టీ, వెరిజాన్ టెలికాం దిగ్గజ సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి. అమెరికా నుంచి వెళ్లాల్సిన లేదా రావాల్సిన 538 విమానాలు 5జీ సేవల ప్రారంభం వల్ల రద్దు కానున్నాయని తెలుస్తోంది. రద్దయిన విమాన సర్వీసులలో ఎమిరేట్స్, ఎయిరిండియా, ఏఎన్ఏ, జపాన్ ఎయిర్లైన్స్కు సంబంధించినవి ఉన్నాయి. 5జీ సర్వీసుల్లో ఉపయోగించే ఫ్రీక్వెన్సీ విమానాల్లోని రేడియో ఆల్టిమీటర్లలో కూడా ఉంటుంది. దీంతో విమానాల ఆల్టిమీటర్లలో ఈ సేవలు జోక్యం చేసుకుంటాయని విమానయాన సంస్థలు భయం వ్యక్తం చేస్తూ విమానాలను రద్దు చేశాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని కొన్ని ఎయిర్ పోర్టుల చుట్టూ 5 జీ సర్వీసుల ప్రారంభాన్ని ఏటీ అండ్ టీ, వెరిజాన్ టెలికాం సంస్థలు తాత్కాలికంగా నిలిపేశాయి.
Read Also: కోవిడ్పై కొత్త మార్గదర్శకాలు… 3 నుంచి 5 రోజులలోపు
అయితే 5జీ సేవల సాంకేతికతతో ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో అమెరికా వెళ్లే విమానాలను ఎయిరిండియా రద్దు చేయడంతో భారత్లోని పలువురు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బుధవారం ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లాల్సిన నాలుగు విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది. ఇది తెలియక హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా అమెరికా వెళ్లాల్సిన ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. తీరా అసలు విషయం తెలిసిన తర్వాత ఎయిరిండియా తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు శుక్రవారం నేరుగా హైదరాబాద్ నుంచి షికాగోకు ఎయిరిండియా విమాన సర్వీస్ ఉంది. ఆలోగా సమస్య పరిష్కారం కాకపోతే ఈ విమాన సర్వీస్ నడుస్తుందో లేదో అన్న సందిగ్ధం నెలకొంది.