Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా పతనమైన వెండి రేట్

Gold And Silver

Gold And Silver

Gold and Silver Price: బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పడిపోయాయి. మంగళవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ఈ రెండు విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. ముఖ్యంగా వెండి ధర కిలోకు రూ.4,400కు పైగా పడిపోయింది.. ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచిన తర్వాత వెండి ధరలు భారీగా ఎగసిపడ్డాయి. మే 13న ఎంసీఎక్స్‌లో వెండి ధర కిలోకు రూ.3 లక్షలు దాటింది. అయితే ఆ తర్వాత వరుసగా ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజా పతనంతో వెండి ధర రూ.3,00,238 నుంచి రూ.2,72,265కు పడిపోయింది. అంటే కేవలం 13 రోజుల్లోనే కిలో వెండి ధర దాదాపు రూ.27,973 మేర తగ్గింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి జూలై 3 గడువు గల సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు రూ.2,76,716 వద్ద ముగిశాయి. కానీ మంగళవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే రూ.4,451 మేర క్షీణించాయి. జనవరిలో వెండి ధర రికార్డు స్థాయిలో కిలోకు రూ.4,57,328 వరకు చేరగా, ప్రస్తుతం ఆ గరిష్ట స్థాయి నుంచి రూ.1,85,063 మేర చౌకగా లభిస్తోంది.

వెండితో పాటు బంగారం ధర కూడా తగ్గింది. జూన్ 5 గడువు గల 24 క్యారెట్ల గోల్డ్ ఫ్యూచర్స్ ధర మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 10 గ్రాములకు రూ.1,59,081 నుంచి రూ.1,58,100కు పడిపోయింది. దీంతో బంగారం ధర తన గరిష్ట స్థాయి అయిన రూ.2,02,984 నుంచి దాదాపు రూ.44,884 మేర తగ్గింది. దిగుమతి సుంకం పెంపు తర్వాత మే 13న బంగారం ధర 10 గ్రాములకు రూ.1,62,186 వరకు చేరింది. ప్రస్తుతం ఆ స్థాయి నుంచి బంగారం ధర రూ.4,086 మేర తగ్గింది.

మే నెల ప్రారంభం నుంచి చూస్తే మాత్రం బంగారం, వెండి ధరలు మొత్తం మీద పెరిగినట్టే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 30న వెండి ధర కిలోకు రూ.2,44,456గా ఉండగా, ప్రస్తుతం అది ఇంకా రూ.27 వేలకుపైగా అధికంగానే ఉంది. అదే సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.1,51,111 నుంచి సుమారు రూ.7 వేల మేర పెరిగింది. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి, దిగుమతి సుంకాల మార్పులు, అంతర్జాతీయ డిమాండ్ ప్రభావం కారణంగా బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక, ఈరోజు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లోనూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.1,58,890కి దిగి రాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి.. 1,45,650కి పరిమితమైంది. ఇక, గ్రామ్ వెండి ధర రూ.295 తగ్గడంతో కిలో వెండి ధర రూ.2,95,000కి చేరుకుంది..