NTV Telugu Site icon

Mlc Kavitha: అమిత్ షా పై క‌విత ట్వీట్ల తూటాలు

Kavitha1

Kavitha1

రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన బీజేపీ.. టీఆర్‌ఎస్‌ సర్కారు, సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా దాడి ముమ్మరం చేసేందుకు సిద్ధమైంది. శనివారం హైదరాబాద్‌ శివార్లలోని తుక్కుగూడలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓవైపు టీఆర్‌ఎస్‌ సర్కారు, సీఎం కేసీఆర్‌ భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తూనే.. మరోవైపు రాష్ట్రంలో బీజేపీకి మరింత సానుకూలత తెచ్చుకునేలా, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా షా ప్రసంగం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే.. తెలంగాణ పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షాపై ట్విట్టర్ వేదిక‌గా ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. రూ. 3000 కోట్లకు పైగా ఉన్న ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ ప్ర‌శ్నించారు. బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ రూ. 1350 కోట్లు, GST పరిహారం రూ. 2247 కోట్ల సంగతేంటి? అని ఆమె ప్ర‌శ్నించారు. బీజేపీ హయాంలో విపరీతంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మతపరమైన అల్లర్లపై మీ సమాధానం ఏమిటి? అని ట్విట‌ర్ వేదిక‌గా అమిత్ షా పై ఎమ్మెల్సీ కవిత ప్ర‌శ్నల‌తో ముంచెత్తారు.

భారత్‌ను అత్యంత ఖరీదైన ఇంధనం మరియు LPGని విక్రయించడంలో అగ్రగామి దేశంగా మార్చడంపై మీ సమాధానం ఏమిటి? అన్నారు. అమిత్ షా జీ, ఈ రోజు మీరు తెలంగాణ ప్రజలను కలిసినప్పుడు గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క IIT, IIM, IISER, IIIT, NID, మెడికల్ కాలేజీ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో తెలంగాణ బిడ్డలకు వివరించండి అంటూ ఎద్దేవా చేశారు.

మిషన్ కాకతీయ మ‌రియు మిషన్ భగీరథకు ₹ 24,000 కోట్ల నిధులు ఇవ్వాలని, NITI అయోగ్ సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో చెప్పండి అంటూ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అమిత్ షా జీ, కర్ణాటకలోని ఎగువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు, జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మ‌రియు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా నిరాకరించడం కేంద్రప్రభుత్వం కపటత్వం కాదా? అంటూ అమిత్ షాకు ట్విట‌ర్ ద్వారా క‌విత ప్ర‌శ్నించారు.

అయితే.. కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాసిన విష‌యం తెలిసిందే.. తెలంగాణకు బీజేపీ చేస్తున్న అన్యాయాలపైన ప్రశ్నలు సంధించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ పట్ల చిత్తశుద్ది ఉంటే తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు. తెలంగాణపై బీజేపీ పార్టీది అదే కక్ష అని… ఎనిమిదేళ్లు గడిచినా అదే వివక్ష. కేంద్రం కడుపు నింపుతున్న తెలంగాణ కడుపు కొట్టడం మానడం లేదని ఫైర్‌ అయ్యారు.

ప్రతిసారి వచ్చుడు.. స్పీచులు దంచుడు.. విషం చిమ్ముడు.. మళ్లీ పత్తా లేకుండా పోవుడు. ఇదే బిజెపి కేంద్ర నాయకులకు అలవాటుగా మాదిందని… ఇంకెంతకాలం తెలంగాణపై ఈ నిర్లక్ష్య ధోరణి అని ఓ రేంజ్‌ ఫైర్‌ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ ముఖం పెట్టుకుని వస్తావని అమిత్‌ షాను ప్రశ్నించారు కేటీఆర్‌.

North Korea: నార్త్ కొరియాలో కరోనా విలయతాండవం… 21 మంది మృతి