Kerala: నిపా నుంచి షిగెల్లా వరకు..కొత్త వ్యాధుల అడ్డాగా కేరళ ఎందుకు నిలుస్తోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explainer: కేరళలోనే కొత్త వ్యాధులు మొదలవుతాయని.. కేరళ అంటే కొత్త, వింత వ్యాధులకు అడ్డా అని ప్రచారం చేసేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ఇండియాలో ఏ రాష్ట్రంలోనైనా ఒక కొత్త వ్యాధి కేసు బయటపడితే ప్రజలు పెద్దగా పట్టించుకోరు కానీ.. అదే వ్యాధి కేరళలో కనిపించిందంటే దేశవ్యాప్తంగా వార్తలు మొదలవుతాయి. కొందరికి కేరళలోనే ఎక్కువ వ్యాధులు వస్తున్నాయేమో అనిపిస్తుంది. కానీ అసలు అది నిజం కాదు. వాస్తవానికి కేరళ వ్యాధుల కేంద్రం కాదు.. వ్యాధులను గుర్తించే విషయంలో దేశంలోనే అత్యంత అప్రమత్తంగా ఉండే రాష్ట్రం. కేరళ వైద్య వ్యవస్థ నిత్యం అలెర్ట్గా ఉంటుంది. కొత్త వ్యాధులను ముందుగా గుర్తిస్తుంది.. వెంటనే దేశాన్ని అలెర్ట్ చేస్తుంది.
మరోవైపు కేరళ గురించి మాట్లాడేటప్పుడు ఇంకో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈ రాష్ట్రం పశ్చిమ కనుమల అడవులు, భారీ వర్షాలు, నదులు, చిత్తడి నేలలు, అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల కలయిక. ప్రకృతి వైవిధ్యం ఎక్కువగా ఉండడం కారణంగా వైరసులు, బ్యాక్టీరియా, దోమలు లాంటి వ్యాధి కారకాలకు కూడా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాదు కేరళలో గ్రామస్థాయి వరకు ఆరోగ్య వ్యవస్థ బలంగా ఉండటం వల్ల చిన్న కేసును కూడా వెంటనే గుర్తిస్తారు.
ఇతర ప్రాంతాల్లో గుర్తించకుండా పోయే అనేక వ్యాధులు కేరళలో ముందుగా రికార్డవుతాయి. అందుకే ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టి తరచూ కేరళపై పడుతుంది. 2018లో ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన నిపా వైరస్ ఉదాహరణ తీసుకుంటే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. పండ్లను తినే గబ్బిలాల నుంచి మనుషులకు చేరిన ఈ వైరస్ మొదట కోజికొడ్ ప్రాంతంలో బయటపడింది. రోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు, అతడిని చూసుకున్నవారికి వ్యాధి సోకింది. అప్పట్లో మరణాల శాతం చాలా ఎక్కువగా ఉండటంతో ప్రజల్లో భయం నెలకొంది. అయితే కేరళ ఆరోగ్య వ్యవస్థ వేగంగా స్పందించింది. రోగులను గుర్తించడం, వారి పరిచయాలను ట్రాక్ చేయడం, ఐసోలేషన్ అమలు చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకుంది. కోవిడ్ మహమ్మారి రాకముందే కాంటాక్ట్ ట్రేసింగ్ అనే పదాన్ని ప్రపంచం మరోసారి గుర్తు చేసుకునేలా చేసింది కేరళ. అయితే నిపా మాత్రమే కాదు.
Also Read
- Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
- Peacock Mountain: ఇరాన్ పీకాక్స్ మౌంటైన్పై దాడికి ప్లాన్..ఈ అణు కేంద్రంపై అటాక్ జరిగితే అంతే సంగతి!
ఇటీవల షిగెల్లా అనే బ్యాక్టీరియా వ్యాధి కూడా తరచూ వార్తల్లోకి వస్తోంది. ఇది ప్రధానంగా కలుషితమైన ఆహారం లేదా తాగునీటి ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అంగన్వాడీలు, పాఠశాలలు, డే కేర్ కేంద్రాల్లో ఒక పిల్లవాడి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించగలదు.
సాధారణ విరేచనాల నుంచి రక్తంతో కూడిన విరేచనాల వరకు తీవ్ర లక్షణాలు కనిపించవచ్చు. వర్షాకాలంలో వరదల కారణంగా మురుగు నీరు తాగునీటిలో కలవడం ఈ వ్యాధికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఇది కేవలం కేరళ సమస్య కాదని ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇక వెస్ట్ నైల్ ఫీవర్ కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇది క్యూలెక్స్ అనే ప్రత్యేక దోమ ద్వారా వ్యాపించే వైరస్ వ్యాధి. ఎక్కువ మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కొంతమందిలో మెదడుపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది.
కేరళలోని నీరు నిలిచే ప్రాంతాలు ఈ దోమలకు అనుకూలంగా మారుతాయి. వాతావరణ మార్పులు కూడా దోమల వ్యాప్తిని ప్రభావితం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం మార్పులు రావడం వల్ల దోమల జీవచక్రం వేగవంతమవుతోంది. దోమల వల్లే వచ్చే మరో పెద్ద సవాలు డెంగీ. ఈ వైరస్ నాలుగు రకాలుగా ఉంటుంది. ఒక రకం సోకిన వ్యక్తికి మరో రకం మళ్లీ సోకే అవకాశం ఉంటుంది. ఇక రెండోసారి వచ్చే ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇంటి చుట్టూ నిల్వ నీరు, మూసుకుపోయిన డ్రెయిన్లు, పాత టైర్లు, కూలర్లు వంటి చిన్న చిన్న ప్రదేశాల్లో ఈ దోమలు గుడ్లు పెడతాయి. ఆశ్చర్యకరంగా ఆ గుడ్లు పొడి పరిస్థితుల్లో కూడా చాలా కాలం బతికే సామర్థ్యం కలిగి ఉంటాయి.
అయితే కేరళలో తరచూ వ్యాధులు కనిపించడానికి అసలు కారణం అక్కడ ఎక్కువ వ్యాధులు ఉండటమేనా అంటే సమాధానం కానే కాదు. అసలు కారణం అక్కడి బలమైన ప్రజారోగ్య వ్యవస్థ. గ్రామ ఆరోగ్య కార్యకర్తల నుంచి వైద్య కళాశాలల వరకు వ్యాధులను గుర్తించే ఒక భారీ నెట్వర్క్ అక్కడ పనిచేస్తోంది. అనుమానాస్పద కేసు కనిపించిన వెంటనే నమూనాలు సేకరించడం, పరీక్షలు నిర్వహించడం, నివేదికలు విడుదల చేస్తారు. అందుకే అక్కడి సమాచారం ప్రపంచ వైద్య పత్రికల్లో కూడా కనిపిస్తుంది. చరిత్రను చూస్తే మానవ నాగరికత ఎప్పుడూ సూక్ష్మజీవులతో పోరాడుతూనే వచ్చింది.
ప్లేగు నుంచి స్పానిష్ ఫ్లూ వరకు, కోవిడ్ నుంచి నిపా వరకు ప్రతి వ్యాధి మనకు ఒకే పాఠం నేర్పింది. వ్యాధిని ఆపేది భయం కాదు.. విజ్ఞానం..! పుకార్లు కాదు.. శాస్త్రీయ అవగాహన. కేరళ కథ కూడా అదే చెబుతోంది. వ్యాధులు పూర్తిగా మాయమవ్వకపోవచ్చు కానీ వాటిని ముందుగానే గుర్తించి నియంత్రించడం ద్వారా వేలాది ప్రాణాలను కాపాడవచ్చు. అందుకే కేరళలో కనిపించే ప్రతి వ్యాధి వార్త వెనుక ప్రపంచానికి ఉపయోగపడే ఒక శాస్త్రీయ పాఠం కూడా దాగి ఉందని సైంటిస్టులు చెబుతుంటారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!