Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ

  • విశాఖలో పట్టపగలు దుండగుడు రక్తపాతం
  • అక్కయ్యపాలెంలో ఇంట్లోకి చొరబడి మహిళ హత్య
  • నమ్మినవాడే ఘాతుకానికి తెగబడినట్లుగా పోలీసుల నిర్ధారణ
Bealert

Bealert

పట్టపగలే నగర నడిబొడ్డున.. జన సంచారం ఉన్న వేళే ఓ మహిళ హత్య కావడం కలకలం రేపింది. ఓ అపార్ట్‌మెంట్ లోకి దూరి దారుణంగా హత్య చేశాడో దుండగుడు. దొంగతనానికి వచ్చి.. బంగారు నగలు దోచుకునే సమయంలో హత్య చేసిన ఘటన ఇది. ఇంట్లోకి చొరబడి మరీ బంగారం కోసం హత్య చేయడంతో.. ఈ ఘటన విశాఖ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణానా ఎవరొచ్చి ఘాతుకానికి పాల్పడతారో అన్న టెన్షన్ పుట్టిస్తోంది.

విశాఖలో పట్టపగలు దుండగుడు ఒక అపార్టుమెంట్‌లో చొరబడి ఒంటరిగా ఉన్న మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలను పట్టుకుపోయిన ఘటన ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.

అక్కయ్యపాలెం 80 ఫీట్‌రోడ్డు సమీపంలోని శ్రీనివాస నగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎవరూ ఊహించని రీతిలో దొంగతనం కోసం వచ్చిన వ్యక్తి హత్య చేసి నగలు పట్టుకుని పోయాడు. ఆ వ్యక్తి వేరే ప్రాంతం నుంచి వచ్చి రెక్కీ నిర్వహించి ఈ దారుణానికి ఒడిగట్టలేదు. అతను పరిచయస్తుడే.. మృతురాలి వద్ద అద్దెకు షాపు తీసుకుని పని చేసుకుంటున్న వ్యక్తే డబ్బు కోసం ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటనతో ఎవరిని నమ్మాలన్నా భయంగాను.. ప్రమాదంగానూ మారింది.

శ్రీనివాస నగర్‌లో గల PRK నాగ్‌ఆనంద్‌ రెసిడెన్సీ ఫ్లాట్‌ నంబర్‌-103 లో నివాసం ఉంటున్నారు పీలా చంద్రశేఖర్‌, పార్వతి దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తెకు వివాహం జరగడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. రెండో కుమార్తె కూడా ఈ మధ్యనే వివాహం చేసుకుని హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. చంద్రశేఖర్‌.. పాన్‌షాప్‌ నిర్వహిస్తుండగా.. పార్వతి ఇంటి వద్దనే ఉంటున్నారు. మధ్యాహ్నం భోజనం తరువాత చంద్రశేఖర్‌ యధావిధిగా షాపునకు వెళ్లారు. తర్వాత సాయంత్రం సమయంలో పార్వతి.. భర్త చంద్రశేఖర్‌కు ఫోన్‌ చేయగా.. ఆయన లిఫ్ట్‌ చేయలేదు. తర్వాత తోటికోడలికి వాట్సాప్‌ కాల్‌ చేసి మాట్లాడారు. రాత్రి 7.30 గంటల సమయంలో చంద్రశేఖర్‌ షాప్‌ మూసేసి ఇంటికి రాగా, తలుపులు తీసి ఉన్నాయి.

ఒక్కసారిగా కంగారు పడ్డాడు చంద్రశేఖర్. ఇంట్లో భార్య కనిపించకపోవడంతో అంతా వెతగ్గా…బెడ్‌రూమ్‌లో మంచం కింద కాళ్లు కనిపించాయి. ఆమెను పిలిచినా పలకకపోవడం, కాళ్లు చీరతో కట్టి ఉండడంతో అనుమానం వచ్చి బయటకు లాగగా, మెడను వైరుతో బిగించి చంపేసిన ఆనవాళ్లు కనిపించడంతో వెంటనే షాక్‌కు గురయ్యాడు. పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, పార్వతి మృతదేహం వద్ద కారంపొడి చల్లి ఉండడంతోపాటు, ఆమె కళ్లద్దాలు విరిగిపోయి కనిపించాయి. దొంగలకు, ఆమెకు మధ్య పెనుగులాట జరిగినట్టు అనుమానిస్తున్నారు. పార్వతి ఒంటిపై ఉండాల్సిన బంగారం పుస్తెలతాడు, నల్లపూసలు, గాజులు, ఇతర బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో సొత్తు కోసమే ఎవరో హత్యచేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో గల సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది నిందితులదే అయి ఉంటుందని భావించారు.

కేసు దర్యాప్తులో భాగంగా అపార్టుమెంట్‌లో సీసీ కెమెరాలు పరిశీలించగా అనుమానంగా ప్రవేశించిన వ్యక్తిని గుర్తించారు. డాగ్ స్కాడ్‌తో గాలించగా పక్క వీధిలో ఓ గ్రూప్ హౌస్ వద్ద ఆగింది డాగ్ స్కాడ్. ప్రాధమిక ఆధారాలు ద్వారా గాలింపు ముమ్మరం చేశారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో, 40 ఫ్లాట్‌లు ఉన్న అపార్టుమెంట్‌ మొదటి అంతస్థులో పట్టపగలే హత్య జరగడం చూస్తుంటే మృతురాలికి తెలిసిన వారిపనే అయివుంటుందని పోలీసులు అనుమానించారు.. పోలీసు బృందాలు జల్లెడ పట్టగా వారి అనుమానమే నిజమైంది. తెలిసిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. ఇంటి యజమానికి ఆ ఏరియాలోనే పక్క వీధిలో చిన్న షాపులు ఉన్నాయ్.. వాటిని అద్దెకు ఇచ్చారు. రాము అనే వ్యక్తి బార్బర్‌గా పనిచేసుకుంటానని ఆ షాపును అద్దెకు తీసుకున్నాడు.. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్న అతను మూడు నెలల నుండి అద్దె చెల్లించలేక పోతున్నాడు. ఇదే విషయమై ఓనర్ చాలా సార్లు షాప్ వద్దకు వచ్చి నిలదీయగా అవమానంగా భావించాడు. దీంతో కోపం పెంచుకున్నాడు.. యజమానురాలు బంగారంపై కన్నేశాడు.. నేరుగా ఇంటికి వెళ్లి అద్దె విషయమై గొడవకు దిగాడు. గొంతు నులిమి హత్య చేశాడు. అసలే ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతు ఉన్న రాముకి మృతురాలి ఒంటిపై నగలు కనబడడంతో బంగారాన్ని కాజేశాడు. నగదు ఉంటుందని భావించి లాకర్‌ తెరవడానికి ప్రయత్నించాడు. తాళాలు వేసి ఉండడంతో వీలుపడక దొరికిన బంగారు ఆభరణాలతో పారిపోయాడు.

చేతికి చిక్కిన సుమారు 5 తులాల బంగారు ఆభరణాలతో హైదరాబాద్ చెక్కేయడానికి ప్లాన్ వేసాడు. ఇక్కడే ఉంటే దొరికిపోతాననే భయంతో రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు. రైలు ఎక్కి పారిపోవడానికి సిద్దంగా ఉన్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. మూడు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామన్నారు పోలీసులు. దోచుకున్న సొత్తును రికవరీ చేసుకున్నారు.