మీరు యూపీఐ (UPI) ద్వారా డబ్బు బదిలీ చేస్తున్నారా? అయితే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. యూపీఐను ఉపయోగించే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యమని సైబర్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఒక చిన్న పొరపాటు కూడా భారీ నష్టానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు క్షణాల్లోనే మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ చేసే ప్రమాదం ఉందని.. అందుకే యూపీఐ మోసాలకు గురికాకుండా ఉండాలంటే కొన్ని కీలక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీల పెరుగుదలతో పాటు మోసాలు కూడా విపరీతంగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల నుండి లక్షల రూపాయలు దొంగిలిస్తున్నారు. దీని నుంచి తప్పించుకోవాలంటే మీ యూపీఐ ఖాతాను ప్రధాన పొదుపు ఖాతా నుండి వేరు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంటే యూపీఐకు లింక్ చేసిన ఖాతాలో పరిమిత మొత్తమే ఉంచాలి. అలాగే అనేక బ్యాంకులు యాప్లో ట్రాన్సాక్షన్ లిమిట్లను సెట్ చేసుకునే అవకాశం ఇస్తాయి. ఇవి సెట్ చేస్తే మోసం జరిగినా నష్టాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
యూపీఐలో డబ్బు పంపే ముందు రిసీవర్ పేరును రెండుసార్లు తనిఖీ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. QR కోడ్ స్కాన్ చేసినప్పుడు స్క్రీన్పై కనిపించే సందేశాన్ని పూర్తిగా చదవండి. సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ “తక్షణంగా చెల్లించండి” అనే ఒత్తిడి కలిగించే సందేశాలు పంపుతారు. అలాంటి సందేశాలు వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ముందుగా ఆ అభ్యర్థనను పరిశీలించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫోన్ను దుకాణాలు, కేఫ్లు వంటి ప్రదేశాలకు రిపేర్ చేయడానికి ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి పిన్ లీక్ అయిన తర్వాత మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లోనే ఖాళీ కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పిన్ను ఎంటర్ చేసే సమయంలో చుట్టూ ఎవరైనా ఉండటాన్ని గమనించండి. అలాగే అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయడం తగ్గించాలని సూచిస్తున్నారు.