పుట్టిన బిడ్డను చూసుకుని.. నవమాసాలు మోసిన విషయాన్ని కూడా మర్చిపోతుంది తల్లి. బిడ్డ పుట్టిన ఆనందం.. ఏ కన్నతల్లి కళ్లల్లోనైనా స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటిది.. తన బిడ్డను తానే చంపేసుకుంది తల్లి.. అనే మాట వింటేనే ఎంతో హృదయవిదారకంగా అనిపిస్తుంది. అలాంటి ఘటనే తిరుపతి జిల్లాలో జరిగింది. కేవలం ఏడుపు ఆపడం లేదని చంపేసింది కన్న తల్లి. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డపైనే అంతటి కర్కశమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఈ కేసులో అసలేం జరిగింది?
బిడ్డ కడుపులో పడితేనే ఆ మహిళ ఆనందం మాటల్లో వర్ణించరాని విధంగా ఉంటుంది. తల్లి కాబోతున్నానే సంతోషంతో ఎన్ని అపసోపాలు పడి అయినా.. బిడ్డను కంటుంది. ఇక బిడ్డ పుట్టిన తర్వాత ఆ ఆనందం మరింత రెట్టింపవుతుంది. తిరుపతి జిల్లా సత్యవేడులోనూ ఓ మహిళ … ఎన్నో కష్టాలు పడి.. నవమాసాలు మోసింది. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అంతా బాగానే ఉంది.. కూతురికి 5 నెలలు నిండాయి. ఆలనా పాలనా కూడా బాగానే చూసుకుంటోంది. కానీ ఈ క్రమంలోనే.. ఓ రోజు పాప ఎంతకూ ఏడుపు ఆపడం లేదు. అంతే ఆ తల్లికి కోపం వచ్చింది. పసిపాప ఎందుకు ఏడుస్తుందో తెలుసుకునే విషయాన్ని మరిచిపోయి.. నెలల చిన్నారిపై కర్కశంగా ప్రవర్తించింది.
Also Read:Mister Death: మిస్టర్ డెత్.. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం..
బిడ్డ ఏడుపు ఆపడం లేదన్న ఒకే ఒక్క కారణంతో చిన్నారి నోరు, ముక్కు మూసేసింది. దీంతో ఆ చిన్నారి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. అంతే 5 నెలలకే ఆ చిన్నారికి నిండు నూరేళ్లూ నిండిపోయాయి. సత్యవేడులోని ఎన్ఆర్ అగ్రహరంలో నివసిస్తున్న వెంకటేష్, హేమావతికి ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. తమిళనాడులోని వెంగలచేరికి చెందిన హైమవతి, వెంకటేశ్ దంపతులు ఉపాధి కోసం సత్యవేడు పరిసర ప్రాంతాలకు వలస వచ్చారు. ఇక్కడ సిమెంట్ ఇటుకల తయారీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు రుత్విక్తో పాటు 5 నెలల చిన్నారి ఉంది.
అయితే పెళ్లైన నాటి నుంచి భార్యా భర్తలు హేమావతి, వెంకటేష్ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఎప్పుడూ కోపంగా ఉండే హైమావతి కన్నబిడ్డ ఏడ్పును భరించలేక పోయింది. 5 నెలల పసిపాప ఆకలితో పాల కోసం గట్టిగా ఏడుస్తుండటంతో తల్లి హైమవతి తీవ్ర అసహనానికి గురైంది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి చిన్నారి గొంతు నులిమేయడంతో, ఆ పసికందు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. చిన్నారి మృతిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సత్యవేడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి.. కన్నతల్లిని అదుపులోకి తీసుకున్నారు.
గత కొంతకాలంగా భర్తతో గొడవలు పడుతున్న మహిళ బిడ్డను హతమార్చడం వెనుక బిడ్డ ఏడుపు కారణమా? లేక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాథమికంగా తల్లి కొన్న మానసిక సమస్యలతో పాటు అతి కోపం ఉన్నట్లుగా ఆమె భర్త స్థానికంగా ఉన్నటువంటి వారు పోలీసులకు తెలిపారు. ఇదే విషయాన్ని తల్లి హేమావతి సైతం పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు మాతృత్వానికి మాయని మచ్చగా మారుతున్నాయి.
