POCSO Case : ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఒక మైనర్ బాలికపై జరిగిన దారుణమైన లైంగిక దాడి ఉదంతం కలకలం రేపుతోంది. బాలికను బెదిరించి, బ్లాక్మెయిల్ చేస్తూ ఘోరానికి పాల్పడిన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ (GST) శాఖ సీనియర్ అసిస్టెంట్ రామ్మూర్తితో పాటు, ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన అతని భార్య, రైల్వే కోడూరు డిప్యూటీ తహసిల్దార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి తూర్పు (ఈస్ట్) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన వెలుగుచూసింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు రామ్మూర్తి సదరు మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే బాలికకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని భయపెట్టాడు. అంతేకాకుండా, నోరు విప్పితే బాలిక తల్లిదండ్రులను సైతం చంపేస్తానంటూ తీవ్రంగా హెచ్చరించి బ్లాక్మెయిల్కు గురిచేశాడు. ఈ వేధింపులు భరించలేక బాధితురాలు హైదరాబాదులోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, అక్కడ తొలుత ‘జీరో ఎఫ్ఐఆర్’ (Zero FIR) నమోదు చేశారు. ఘటన తిరుపతిలో జరగడంతో ఆ కేసును జగద్గిరిగుట్ట పోలీసులు తిరుపతి పోలీసులకు బదిలీ చేశారు.
కేసును స్వీకరించిన తిరుపతి ఈస్ట్ పోలీసులు నిందితుడు రామ్మూర్తిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో నిందితుడైన రామ్మూర్తిని కేసు నుంచి తప్పించేందుకు, బాధితురాలిని లొంగదీసుకునేందుకు అతని భార్య (డిప్యూటీ తహసిల్దార్) తో పాటు, బాలికకు వరుసకు పిన్ని అయిన మానస అనే మహిళ కూడా సహకరించినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు రామ్మూర్తితో పాటు సహకరించిన పిన్ని మానసను కూడా అరెస్ట్ చేశారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ప్రభుత్వ అధికారిణి అయిన భార్య పాత్రపై విచారణ జరుపుతున్నామని, విధుల్లో నిర్లక్ష్యం వహించి క్రైమ్కు సహకరించినందుకు ఆమెపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.
ఈ కేసు వివరాలను తిరుపతి డీఎస్పీ భక్తవత్సలము మీడియాకు వెల్లడించారు. మైనర్ పిల్లలపై ఇలాంటి వేధింపులు, లైంగిక దాడులు జరుగుతున్నప్పుడు భయపడి దాచిపెట్టవద్దని ఆయన తల్లిదండ్రులకు, బాధితులకు విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఇటువంటి కీచకులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావాలన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసే బాధితుల వివరాలను, వారి గోప్యతను (Privacy) పూర్తిగా కాపాడుతామని, బాధితులకు న్యాయం జరిగేలా శరవేగంగా దర్యాప్తు పూర్తి చేస్తామని డీఎస్పీ భక్తవత్సలము హామీ ఇచ్చారు.
