Bengaluru:బెంగళూర్లో దారుణం జరిగింది. 29 ఏళ్ల మహిళను కిరాతకంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని 32 ముక్కలు చేసి, ఆమె నివాసంలోని ఫ్రిజ్లో దాచిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ప్రస్తుతానికి ఎవరు చంపారు..? ఎందుకు చంపారు..? అనుమానితులు ఎవరు..? అనే వివరాలు తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో నిందితుడి గురించి తెలిసే అవకాశాలు ఉన్నాయి. మృతురాలిని బెంగళూర్ సమీపంలోని నేలమంగళకు చెందిన మహాలక్ష్మీగా గుర్తించారు. ఆమె భర్తని హేమంత్ దాస్గా పోలీసులు గుర్తించారు.
Read Also: Rahul Gandhi: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ
ఈ ఘటన బెంగళూర్లోని వయాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 15 రోజుల క్రితమే యువతి హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్య ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్యని తలపిస్తోంది. మల్లేశ్వరం పరిధిలోని వైయాలికావల్ మున్నేశ్వర్ బ్లాక్లోని మొదటి అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు డాగ్ స్వ్కాడ్, ఫింగర్ ఫ్రింట్స్ నిపుణులను సంఘటన స్థలానికి రప్పించారు. అదనపు కమిషనర్ కేసును దగ్గరుండి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే బాధితురాలు ఈ ఇంటికి మారినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం బాధిత మహిళ తల్లి, చెల్లి ఆమెని చూసేందుకు ఇంటికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హత్య బెంగళూర్లో సంచలనంగా మారింది. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమె ఉదయం 9.30 గంటలకు జాబ్కి వెళ్తే, రాత్రి 10.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేదని స్థానికులు తెలిపారు. బాధితురాలి తల్లి, సోదరి ఇంటికి వచ్చిన క్రమంలో దుర్వాసన రావడంతో ఫ్రిడ్జ్ తెరిచి చూడగా ఈ ఘటన గురించి తెలిసింది.