Shabad Six-Murder Case: షాబాద్లో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజ్కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో కేసులోని కీలక ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకాల్సి ఉంది. ఈ ఘటనలో భార్య సరిత, ఇద్దరు కుమారులను అత్యంత దారుణంగా హత్య చేసిన రాజ్కుమార్ చర్యపై సరిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక మరో యువతితో రాజ్కుమార్కు ఉన్న సంబంధమే ప్రధాన కారణమని వారు ఆరోపిస్తున్నారు. సరిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజ్కుమార్ కొంతకాలం సజావుగానే కుటుంబాన్ని నడిపాడని, అయితే తర్వాత ఓ బాలికతో సంబంధం పెట్టుకుని ఆమెను పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో భార్య, పిల్లలను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడని తెలిపారు. అంతేకాకుండా కుటుంబ ఆస్తులను విక్రయించి ఆ బాలిక కుటుంబానికి ఆర్థిక సహాయం చేశాడని ఆరోపించారు.
రాజ్కుమార్ నిర్ణయాన్ని సరిత తీవ్రంగా వ్యతిరేకించిందని, తమ ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరో వివాహం చేసుకోవద్దని ఎన్నోసార్లు వేడుకున్నప్పటికీ అతను వినలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించుకుందామని కూడా సరిత సూచించినట్లు వారు వెల్లడించారు. అయినప్పటికీ పరిస్థితి మరింత విషమించి చివరకు ఈ ఘోరానికి దారితీసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కూడా రాజ్కుమార్కు సహకరించారంటూ సరిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఇక ఈ దారుణ ఘటనలో కుమార్తె, ఇద్దరు మనవళ్లను కోల్పోయిన సరిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందలేదని, ప్రజాప్రతినిధులు కూడా పరామర్శించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ప్రభుత్వ సహాయం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, రాజ్కుమార్ మరణంతో ఘటన వెనుక అసలు కారణాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

