నవమాసాలు మోసి కనిపెంచిందన్న కనికరం లేదు. చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచిందన్న విశ్వాసం లేదు. తల్లి ప్రవర్తనతో విసుగు చెంది బాబాయ్ సహాకారంతో కన్న తల్లినే అతి దారుణంగా అంతమొందించారు కన్న కూతుళ్లు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో కలకలం రేపింది. అనకాపల్లి జిల్లాలో ఓ మహిళ మృత దేహం 15 రోజుల కిందట తీవ్ర కలకలం రేపింది. హైవేకు కూత వేటు దూరంలోనే పొదల్లో సగం కాలిన మృతదేహం అప్పట్లో సంచలనం కలిగించింది. చుట్టూ సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో మిస్టరీగా మారింది. చనిపోయింది ఎవరు? చంపింది ఎవరు అనేది కొద్ది రోజుల పాటు మిస్టరీగా కొనసాగింది. అయితే ఇప్పుడు ఆ మిస్టరీ వీడింది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్ద 15 రోజుల క్రితం జరిగిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కన్న తల్లి ప్రవర్తనతో విసుగుచెందిన కుమార్తెలు.. బాబాయ్తో కలిసి హత్యకు ప్లాన్ వేసి మర్టర్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది…
ఒడిశా రాష్ట్రానికి చెందిన బంకెల సంతుకు 37 ఏళ్లు.. భర్తతో కొంతకాలం క్రితం మనస్పర్థలు రావడంతో వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. సంతు తన ఇద్దరు కుమార్తెలతో కలిసి కూర్మన్నపాలెంలోని రాజీవ్నగర్లో నివాసం ఉంటున్నది. పెద్ద కుమార్తె అనూష పంజాబ్లోని యూనివర్సిటీలో చదువుతున్నది. 15 ఏళ్ల చిన్న కుమార్తె ఇంటర్ ఫస్ట్ సంవత్సరం చదువుతూ, హాస్టల్లో ఉంటున్నది. తల్లి సంతు ఆన్లైన్ బెట్టింగ్లు, చెడు వ్యసనాలకు లోనయి డబ్బులు వృథా చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కుమార్తెలతో పాటు సంతు మరిది మురళీధర్ ఇటీవల ఆమెతో గొడవపడ్డారు..
హాస్టల్లో ఉంటున్న చిన్న కుమార్తె ఇంటికి వచ్చినప్పుడు తల్లి ఫోన్లో అసభ్యకర దృశ్యాలతో పాటు బెట్టింగ్ యాప్లు ఉండడాన్ని గుర్తించింది. ఈ విషయాన్ని అక్క అనూషకు చెప్పడంతో ఆమె పంజాబ్ నుంచి ఇక్కడకు వచ్చింది. ఇద్దరూ కలిసి తల్లిని నిలదీసి, ఆమెతో గొడవపడ్డారు. తల్లి ప్రవర్తనతో విసుగు చెందిన కుమార్తెలు… ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. రాజీవ్నగర్లోనే నివాసం వుంటున్న బాబాయ్ మురళీధర్కు ఈ విషయం చెప్పి, ఆయన సాయం కోరారు. ముగ్గురూ కలిసి ప్రణాళికను రూపొందించుకుని ఆగస్ట్ 13న అర్ధరాత్రి దాటిన తరువాత గాఢ నిద్రలో వున్న ఉన్న సంతుని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మురళీధర్ తన స్నేహితుడి కారులో సబ్బవరం మండలం బాటజంగాలపాలెం వద్దకు తీసుకువచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు…
ఆగస్ట్ 14న ఉదయం అటుగా వెళుతున్న స్థానికులు, సగం కాలిన మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సబ్బవరం పోలీసులు వెళ్లి వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న ఎస్పీ తుహిన్ సిన్హా సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు.. నిందితులను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను నియమించారు. సంతుని ఆమె కుమార్తెలు, మరిది కలిసి హత్య చేసినట్టు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గుర్తించారు. మురళీధర్తోపాటు అనూషను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితురాలు మైనర్ కావడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచినట్టు ఎస్పీ తెలిపారు..
Uttar Pradesh: రెచ్చిపోయిన హిజ్రాలు.. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్పై దాడి
