Man Kills Daughter: కూతురిపై ఓ తండ్రి దారుణంగా ప్రవర్తించాడు. చివరకు ఆమె ప్రాణాలను తీశారు. చదువు కోవడం లేదని ఆమెను కొట్టి చంపాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహి జిల్లాలో చోటు చేసుకుంది. 17 ఏళ్ల కుమార్తె సరిగా పరీక్షలకు సిద్ధం కావడం లేదని కోపంతో ఆమెను కొట్టి చంపినట్లు శనివారం పోలీసులు తెలిపారు. నిందితుడిని ప్రేమ్ నగర్ నివాసి ఫతే మహ్మద్(42)గా గుర్తించారు. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పుష్పేంద్ర వర్మ తెలిపారు. పరీక్షలకు రెండు రోజుల ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి కొట్టడంతో స్పృహ కోల్పోయిన బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది.
11వ తరగతి చదువుతున్న తన కూతురు సరిగా చదువుకోవడం లేదని, పరీక్షలకు సరిగా సిద్ధం కావడం లేదని మహ్మద్ ఆమెపై కోపం పెంచుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో గురువారం కుమార్తెపై కర్రతో దాడి చేశాడు. దాడి తర్వాత తీవ్రగాయాలైన బాలిక మరణించింది. బాలిక మేనమామ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడైన తండ్రిని శనివారం పోలీసులు అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ప్రకారం.. బాలిక అంతర్గత గాయాల కారణంగా మరణించి ఉండొచ్చని, అయితే మరణానికి ఖచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదికి వచ్చిన తర్వాతే వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.