రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ గంగానగర్ జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. 13 ఏళ్ల బాలిక అక్రమ రవాణా, సామూహిక అత్యాచారం ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ, విద్యార్థి సంఘాలు తీవ్ర నిరనస కార్యక్రమాలు చేపట్టాయి. ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఇంటి నుంచి తప్పిపోయిన 13 ఏళ్ల బాలికను స్థానిక రిక్షా డ్రైవర్ ఆశపెట్టి శ్రీగంగానగర్ లోని కొందరు హోటల్ యజమానులకు అమ్మేశాడు. కేవలం 5 రోజుల వ్యవధిలో హోటల్ య జమానాలు, మేనేజర్లు 30 మందికి పైగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బలవంతంగా మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఎమ్మెల్యే రూపిందర్ సింగ్ కన్నార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు నిరసనగా శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ భారీ ప్రదర్శన నిర్వహించింది. పోలీసులు, హోటల్ నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది పోలీసులు, నిఘా వ్యవస్థ వైఫల్యాన్ని బయటపెడుతోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన హోటల్ యజమానులు, రిక్షా డ్రైవర్కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారం ఆ జిల్లాలో జరుగుతున్న అక్రమ హోటళ్ల వ్యాపారాన్ని బట్టబయలు చేసింది. శ్రీ గంగానగర్ పర్యాటక ప్రాంతం కావడంతో ఇక్కడ 150కి పైగా అక్రమ హోటళ్లు పనిచేస్తున్నారు. వీటిలో 40 హోటళ్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు ఉన్నాయి. మిగిలిన హోటళ్లకు ఎలాంటి పత్రాలు, నిబంధనలు లేవు. ఈ హోటళ్ల మాఫియాపై కూడా ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.

