EMI Crime: అప్పుతో ట్రాక్టర్ కొనుగోలు చేసి EMI చెల్లించడానికి డబ్బులు లేవని సొంత బంధువులే దారుణహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్ లోని ప్రతాప్గఢ్ జిల్లాలో జరిగింది. తల్లికూతుళ్లను సొంత బంధువులే హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ట్రాక్టర్ ఫైనాన్స్ వాయిదాలు చెల్లించడానికి, మృతుల వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలను దొంగిలించేందుకు హత్యకు పాల్పడ్డారు.
మే 28న జిల్లాలోని దేవ్గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతామాత అభయారణ్యంలోని భోపఖేడా పాల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంకీ మీనా, ఆమె కుమార్తె కమల ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో ఆమె మరిది బాబులాల్ మీనా, అతడి భార్య గెండాబాయిలు కలిసి హత్య చేశారు. నిందితులు ఇంట్లోకి చొరబడి మంకీ మీనా వెండి కంకణాలు, ఇతర ఆభరణాలు, నగదును దొంగిలించారు. దొంగిలించిన ఆభరణాలను అమ్మేసి, ట్రాక్టర్ ఫైనాన్స్ కట్టేద్దామని భావించారు.
కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు దర్యాప్తు కోసం స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్, డాగ్ స్వ్కాడ్, సైబర్ టీమ్ సహాయంతో సాంకేతిక ఆధారాలు సేకరించారు. జూన్ 11న అటవీ ప్రాంతంలో నిందితుడు దాగి ఉన్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు బాబూలాల్ మీనాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడితో పాటు భార్య గెండాబాయిని కూడా అరెస్ట్ చేశారు.
నిందితుడు బాబూలాల్ ఇటీవల ఒక సెకండ్ హ్యాండ్ సోనాలిక ట్రాక్టర్ను రూ. 2.55 లక్షలతో కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించేందుకు డబ్బు లేకపోవడంతో మంకీ మీనా వద్ద బంగారం, వెండి ఆభరణాలు దోచుకోవాలని ప్లాన్ చేసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. నేరం చేసిన తర్వాత కూడా ఇద్దరు నిందితులు మృతుల వద్ద దు:ఖిస్తూ నటించారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కత్తి, ఇతర వస్తువుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

