Site icon NTV Telugu

NZB WIFE MURDER: మొగుడే యముడు..

Crime

Crime

NZB WIFE MURDER: ఆమె నిండు గర్భిణీ.. రేపో మాపో మరో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆ మాతృమూర్తిని.. కట్టుకున్నోడు కసాయిలా మారి కడతేర్చాడు. గాఢ నిద్రలో ఉన్న ఆ గర్భిణీని గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు. ఊపిరాడక రెండు ప్రాణాలు గాలిలో కలిశాయి. హత్య చేసి.. సహజ మరణంగా చిత్రీకరించేందుకు కూడా ప్రవర్తించాడు. కానీ అల్లుడి ప్రవర్తనలో మార్పు గుర్తించిన మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు బాగోతం బయటపడింది. రంగంలో దిగిన పోలీసులు నిందితున్ని అదుపులో తీసుకుని తమదైన శైలిలో విచారించారు. రెండో పెళ్లి కోసం చేసుకోవాలనే ఆలోచనతో మొదటి భార్యను హత్య చేసినట్లు.. పోలీసుల విచారణలో తేలింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో విషాదం నెలకొంది. ఇప్పటికే ముగ్గురు కుమారులకు జన్మనిచ్చి.. మరికొన్ని రోజుల్లో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న నిండు గర్బిణీ భర్త చేతిలో హత్యకు గురైంది.

గన్నారం గ్రామానికి చెందిన నగేష్‌కు.. కామారెడ్డి పట్టణం తిమ్మక్‌పల్లికి చెందిన సుమలతతో పదేళ్ల క్రితం విహహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు. సుమలత ప్రస్తుతం 9 నెలల గర్బిణీగా ఉంది. మద్యానికి బానిసైన నగేష్.. తరచూ భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలో భార్యను శాశ్వతంగా వదిలించుకుని, రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకుందే తడవుగా.. ఈనెల 22న ఇంట్లో నిద్రిస్తున్న భార్య గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి రెండు ప్రాణాలను కడతేర్చాడు. ఆపై.. ఏమి తెలియనట్లు తన భార్య నిద్రలోనే మృతి చెందినట్లు సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మరుసటి రోజు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఐతే అల్లుడి ప్రవర్తనలో తేడా గమనించిన .. మృతురాలి తల్లి బాలరాజవ్వ… తన కూతురు మృతికి అల్లుడు కారణం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమదైన శైలిలో విచారణ చేపట్టిన పోలీసులు… నిందితుని నుంచి నిజం కక్కించారు.

పదేళ్లుగా సుమలత-నగేష్ అన్యోన్యంగా ఉన్నారు. వారికి ముగ్గురు మగ పిల్లలు. సుమలత మరో సారి గర్భం దాల్చింది. 9 నెలల నిండు గర్బిణిగా ఉన్న సుమలతను భర్త శారీరక వేధించేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన నగేష్.. హైదరాబాద్‌లో పని చేస్తున్న క్రమంలో మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించే వాడని గ్రామస్ధులు తెలిపారు. ఈ క్రమంలో తమ వివాహేతర సంబంధానికి భార్య అడ్డుగా ఉంటుందని ఆమె అడ్డు తొలగించుకున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిండు గర్బిణీగా ఉన్న భార్యను గొంతు నులిమి చంపిన ఘటన రాష్ట్ర స్దాయిలో కలకలం సృష్టించింది. రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో నిండు గర్బిణీగా ఉన్న మొదటి భార్యను కడతేర్చడం పట్ల గ్రామస్ధులు మండిపడుతున్నారు. రెండో పెళ్లి కోసం కట్టుకున్న భార్యను ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపి.. కటకటాల పాలయ్యాడు నిందితుడు. తల్లి హత్యకు గురికాగా.. తండ్రి జైలు పాలు కావడంతో.. ఆమె ముగ్గురు పిల్లలు రోడ్డున పడ్డారు.

Exit mobile version