Site icon NTV Telugu

Crypto Scam : హైదరాబాద్‌లో క్రిప్టో కరెన్సీ మోసం.. నెక్ట్స్‌బిట్‌ యాప్ నిర్వాహకుడు అరెస్ట్

Cyrpto Fraud

Cyrpto Fraud

Crypto Scam : క్రిప్టో కరెన్సీ.. ఇదొక ఊగిసలాట ట్రేడింగ్ దందా. నష్టాలు హైరిస్క్‌లో ఉంటాయి. కానీ కొంత మంది అధిక లాభాలు ఆశ చూపిస్తూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. క్రిప్టోలో పెట్టుబడి పెడితే మీ జీవితమే మారిపోతుందని చెబుతున్నారు. కానీ అమాయక జనం మాత్రం అందులో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ క్రిప్టో కరెన్సీ యాప్ నిర్వహిస్తూ జనానికి కుచ్చుటోపీ పెడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈజీ మనీ అంటే.. ఎవరికైనా ఆశ ఉంటుంది. సులభంగా డబ్బులు వస్తాయని ఒకప్పుడు లాటరీ టికెట్లు కొనేవారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్, ఆన్ లైన్ గేమ్స్ వంటివి ఆడుతున్నారు. కొంత మంది అయితే బిట్ కాయిన్ ట్రేడింగ్ చేస్తున్నారు. నిజానికి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అనేది తప్పేం కాదు. కానీ అందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందులో పరిజ్ఞానం ఉన్నవాళ్లే రాణించగలుగుతారు…

ఇంత వరకు బాగానే ఉంది. కానీ క్రిప్టో కరెన్సీ పేరుతో కొంత మంది కేటుగాళ్లు అమాయకులకు వల విసురుతున్నారు. ఇందులో భాగంగా జనాలను అందిన కాడికి మోసం చేస్తున్నారు. వారు పెట్టుబడి రూపంలో పెట్టిన డబ్బులు కొట్టేస్తున్నారు. అలాంటి ఓ కేటుగాడ్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో నెక్ట్స్‌బిట్‌ అనే క్రిప్టో కరెన్సీ యాప్ నిర్వాహిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఐతే అతని అరెస్ట్ తర్వాత కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం పోలీసు యాక్షన్‌ అంతా నెక్ట్స్‌బిట్‌ వ్యతిరేక యాప్‌ వర్గం వాళ్లు చెప్పిన విధంగా జరిగిందనే ప్రచారం జరుగుతోంది..

తమ కంటే అధిక వ్యాపారం చేస్తున్నాడన్న కోపంతో వ్యతిరేక వర్గం యాప్‌ వారే.. నెక్ట్స్ బిట్ యాప్ నిర్వాహకుడు హిమాన్షు అరెస్టులో కీలకంగా వ్యవహరించారు. నిజానికి క్రిప్టో కరెన్సీ పేరిట అనేక యాప్‌లు నడుస్తున్నా.. ఎలాంటి ఫిర్యాదూ లేకుండా విశ్వసనీయ సమాచారంతో అరెస్టు చేసింది ఈ ఒక్క కేసులోనే కావడం విశేషం. ఇందుకోసం నెక్ట్స్‌బిట్‌ పోటీదారైన మరో యాప్‌ నిర్వాహకులు రంగంలోకి దిగారు. నెక్ట్స్‌బిట్‌ యాప్‌కు సంబంధించిన కొందరు బాధితులను వెంటేసుకుని రాచకొండలోని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. వీరిచ్చిన సమాచారంతోనే పోలీసులు ఓ హోటల్‌లో తమ యాప్‌ను ప్రమోట్‌ చేసుకుంటున్న హిమాన్షును అరెస్టు చేశారు. అతని అరెస్టు తతంగం అయ్యేవరకూ పోటీదారు యాప్‌ నిర్వాహకుల ప్రతినిధులు అక్కడే ఉన్నారు..

 

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో క్రిప్టో కరెన్సీ దందా పెరుగుతోంది. అనతికాలంలోనే రూ.కోట్ల లాభాలు అంటూ అమాయకులకు ఆశచూపి.. విదేశీ ప్రయాణాలు ఎరవేసి.. వారి నుంచి లక్షల రూపాయలు గుంజుతున్న యాప్‌ల సంఖ్య పెరిగిపోతోంది. మార్కెట్‌లో వీటిని నియంత్రించే మెకానిజం ఏదీ లేకపోవడంతో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా వీటి మధ్య ఆధిపత్య పోరు కూడా సాగుతోంది. ఇటీవల దాదాపు 400 మంది వద్ద 19 కోట్ల మేరకు మోసం చేశారని పోలీసులు.. తమ రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు…

నిజానికి నెక్ట్స్‌బిట్‌ ప్రవేశించే కంటే ముందే.. డజనువరకు యాప్‌లు దందా చేస్తున్నాయి. వీరంతా జనాలను నమ్మించేందుకు ఒకరిని మించి మరొకరు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని యాప్‌లు జనాల నుంచి డబ్బులు వసూలు చేసి అదృశ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త యాప్‌లను అంత తేలిగ్గా నమ్మడం లేదు. అందుకే వీరి పెట్టుబడికి ఆస్తులను ష్యూరిటీగా ఇస్తున్నారు. ఉదాహరణకు వీరు ఐదు నుంచి పది మంది పెట్టుబడిదారులను ఒక గ్రూపుగా పోగుచేస్తారు. వీరికి నమ్మకం కలిగేలా రూ.20 లక్షలు కూడా చేయని భూమికి రూ.50 లక్షలు అని చెప్పి.. బాధితుల నుంచి అంతమేరకు డబ్బును క్రిప్టో పేరిట వసూలు చేస్తారు. ఆ డబ్బుకు సమాన విలువ అంటూ కొన్ని డాలర్లను వారి ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌కు పంపుతారు. ఇటు యాప్‌లో ఉన్న డాలర్లను, అటు తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేసిన భూములను ష్యూరిటీగా చూసుకుని మురిసిపోతున్నారు. తమ పెట్టుబడి పెట్టిన డబ్బు తిరిగి రాదని, తాము కొన్న భూమికి అంత విలువలేదన్న విషయం వీరు గ్రహించే సరికి నిర్వాహకులు ఆ డబ్బును లక్కీభాస్కర్‌ సినిమాలో మాదిరిగా దేశం దాటేస్తున్నారు…

ఇటీవల జీబీఆర్‌ క్రిప్టో కరెన్సీపేరిట రూ.95 కోట్లు, మెటాపేరిట రూ.100 కోట్లు, నెక్ట్స్‌బిట్‌ పేరిట రూ.19 కోట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత ఉంటుంది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాలో బాధితుల సంఖ్య అధికంగా ఉంది…

 

Exit mobile version