Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్‌లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..

  • ఆపరేషన్ థియేటర్‌లో నర్సు మర్డర్..
  • విషాన్ని ఇంజెక్ట్ చేసి హత్య చేసిన ప్రియుడు..
Crime News

Crime News

Nurse Murder Case: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లోని లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రైవేట్ ఆస్పత్రి నర్సు అనుమానాస్పదంగా మరణించింది. అయితే, పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఇది హత్య అని తేలింది. ప్రియుడే హత్య చేసినట్లు వెల్లడైంది. తనను పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి తెస్తుండటంతో పథకం ప్రకారం ప్రియుడు హత్యకు పాల్పడినట్లు తేలింది. ఆస్పత్రి ఉద్యోగితో కలిసి ఆపరేషన్ థియేటర్‌లో విషాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా హత్యకు పాల్పడినట్లు తెలిసింది. అయితే, ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఒక నకిలీ సూసైడ్ నోట్ రాసి మృతదేహం వద్ద ఉంచారు. ఈ కేసులో ప్రియుడితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఫఫుండాకు చెందిన 25 ఏళ్ల నేహా, లోహియా నగర్‌లోని ఎంసీసీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమె శనివారం ఉదయం ఆస్పత్రికి వెళ్లింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆపరేషన్ రూంలో అపస్మారక స్థితిలో కనిపించింది. వైద్యులు ఆమెను పరీక్షించి మరణించినట్లు ప్రకటించారు. పోలీసులు ఆమె మృతదేహం వద్ద సల్ఫర్ మాత్రలు, ఆమె అత్తమామలపై ఆరోపణలు చేస్తూ రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, సూసైడ్ నోట్‌పై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తి చేశారు. అత్తమామలతో ఎలాంటి గొడవ లేదని చెప్పారు.

హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ కాల్ రికార్డుల్ని పరిశీలించారు. దీంతో ఆస్పత్రి ఉద్యోగి సురేష్, నేహా గత 7-8 ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్‌లో నేహా, సురేష్, మరో ఉద్యోగి ఫర్హాన్‌లతో కలిసి ఆపరేషన్ థియేటర్‌లోకి ప్రవేశించడం కనిపించింది. విచారణలో తనకు పెళ్లయిందని, ఐదేళ్ల కొడుకు ఉన్నాడని సురేష్ నేహాతో చెప్పాడు. అయినా కూడా నేహ తనపై పెళ్లి కోసం ఒత్తిడి తెస్తూనే ఉందని అందుకే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నేహా నీరసంగా ఉందని చెప్పడంతో, శక్తి కోసం సెలైన్ ఎక్కిస్తామని చెప్పి అందులో విషం కలిపినట్లు తేలింది. ఏడాది క్రితం నేహ భర్త రవి కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తెలిసింది. నేహ తన కుటుంబం, పిల్లల్ని పోషించుకోవడానికి నర్సుగా పనిచేస్తోంది.