వరంగల్లో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో వేధించాడు.. దీంతో యువతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.. కానీ దమ్ముంటే హైదరాబాద్ రండి అంటూ సవాల్ విసిరి వచ్చాడు.. సీన్ కట్ చేస్తే.. యువతి కుటుంబ సభ్యులు.. హైదరాబాద్కు వచ్చి మరీ అతన్ని మర్డర్ చేసేశారు. అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఆ యువకుడు ఎవరు? జరిగింది పరువు హత్యా? ప్రతీకారంలో భాగంగా చంపేశారా?
ఈ మర్డర్కు ప్రేమ పేరుతో వేధింపులేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వరంగల్ నుంచి వచ్చిన భాస్కర్.. వచ్చే సమయంలో దమ్ముంటే హైదరాబాద్కు రండి అని సవాల్ విసిరాడని.. ఆ సవాల్లో భాగంగా వచ్చి చంపేశారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ హబ్ మాదాపూర్లో.. ప్రేమ వ్యవహారం.. వివాదాస్పదంగా మారి ఓ యువకుడి దారుణ హత్యకు దారితీసింది. రామేశ్వరం కేఫ్ ఎదుట జరిగిన ఈ ఘటన నగరంలో ఒక్కసారిగా కలకలం రేపింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సీనపల్లి భాస్కర్పై ఇద్దరు వ్యక్తులు కర్రలు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితులిద్దరూ నేరుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. భాస్కర్.. మాదాపూర్లోని ఓ హోటల్లో కుక్గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి రామేశ్వరం కేఫ్ సమీపంలో అతడిని అడ్డగించిన తమ్మెడబోయిన రాజు, మారం కుమారస్వామి కత్తులు, కర్రలతో దాడి చేశారు. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
హైదరాబాద్కు వచ్చి పథకం ప్రకారం దాడి..
భాస్కర్ ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో వేధించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై గతంలో వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఐతే ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు పోలీసులు. అయినప్పటికీ వివాదం కొనసాగిందని పోలీసులు చెబుతున్నారు. అనంతరం భాస్కర్ “దమ్ముంటే హైదరాబాద్కు రండి” అంటూ సవాల్ విసిరినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన యువతుల తండ్రి తన బంధువుతో కలిసి హైదరాబాద్కు వచ్చి పథకం ప్రకారం దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే ఈ కేసులో మరో కోణాన్ని మృతుడు భాస్కర్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భాస్కర్, ఓ యువతి పరస్పర అంగీకారంతో ప్రేమించుకున్నారని.. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని వారు చెబుతున్నారు. యువతి కుటుంబ సభ్యులు కులాంతర వివాహానికి వ్యతిరేకించారని, గతంలోనే చంపేస్తామని బెదిరించారని ఆరోపిస్తున్నారు. వేధింపులు, వెంటపడడం వంటి ఆరోపణల్లో నిజం లేదని, ఈ హత్య పరువు, కుల వివక్ష కారణంగానే జరిగిందని భాస్కర్ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రేమ, వేధింపుల ఆరోపణలు, కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రేమ, కుల వివాదం ఆరోపణలు సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాతే హత్యకు దారితీసిన అసలు కారణాలు స్పష్టమయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

