Honour killing: లక్నో రైల్వే స్టేషన్లో ఛప్రా-గోమతినగర్ ఎక్స్ప్రెస్ రైలులో దొరికిన యువతి డెడ్బాడీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్లీపర్ కోచ్లో బెర్తు కింద ఒక పెట్టెలో చేతులు, కాళ్లు నరికేసిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతురాలిని 16 ఏళ్ల బాలికగా గుర్తించారు. సొంత తండ్రే దారుణంగా హత్య చేసినట్లు తేలింది.
తన కుమార్తె హిందూ యువకుడితో మాట్లాడుతోందని, ప్రేమిస్తోందని అనుమానించిన తండ్రి బిగ్గన్ అన్సారీ ఈ హత్యకు పాల్పడ్డాడు. మతం వేరు కావడంతో అతడితో మాట్లాడవద్దని పలుమార్లు హెచ్చరించినప్పటికీ వినకపోవడంతో, పరువు పోతుందనే ఉద్దేశంలో అతను ఈ హత్యకు పాల్పడ్డాడు. అయితే, ఈ కుటుంబంలో అప్పటికే పెద్ద కుమార్తె హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇంకో కుమార్తె కూడా హిందూ వ్యక్తిని పెళ్లిచేసుకుంటుందనే భయంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read ALSO: AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
ఇది ఆవేశంతో జరిగిన హత్య కాదని, పక్కా ప్లానింగ్తోనే హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనకు 5 రోజుల ముందే నిందితుడు తన భార్య, ఇద్దరు కొడుకులను బంధువుల ఇంటికి పంపించాడు. నిందితుడు తన సోదరి, బావతో కలిసి హత్యకు కుట్ర పన్నారు. హత్య తర్వాత, కుమార్తె శరీరాన్ని ఆరు ముక్కలుగా నరికినట్లు పోలీస్ విచారణలో తేలింది. తలను గ్రామ చెరువులో పారేయగా, చేతులు కాళ్లను వేర్వేరుగా పాలిథీన్ సంచుల్లో ప్యాక్ చేసి, ఒక పెట్టెలో పెట్టి రైలులో స్లీపర్ కోచ్లో ఉంచాడు.
రైల్వే స్టేషన్, రైలులోని సీసీటీవీ కెమెరాలు నిందితుడిని పట్టుకోవడానికి మార్గాన్ని సుగమం చేశాయి. అనుమానిత వ్యక్తి ఒక పెట్టెను మోసుకెళ్తున్నట్లు కనిపించింది. పోలీసులు బాలిక తలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
