Lucknow Crime: లక్నోలోని గోమతీనగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యను కాల్చి చంపిన అనంతరం ఆమెను హత్య చేసిన విషయాన్ని మొబైల్ స్టేటస్లో పెట్టిన ఓ వ్యక్తి.. ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న తన సోదరిని కాల్చి చంపి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. మానస్ బాజ్పాయ్ ఎస్బీఐలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అతడికి తన భార్య దివ్య మిశ్రాతో కొంతకాలంగా కుటుంబ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ దంపతులు దాదాపు ఏడాది కాలంగా విడిగా ఉంటున్నట్లు సమాచారం. ఈ వివాదానికి సంబంధించి ఫ్యామిలీ కోర్టులో కేసు కూడా పెండింగ్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం దివ్య తన విధుల్లో భాగంగా గోమతీనగర్లోని ఓ బ్యాంకుకు వెళ్లింది. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న మానస్.. బ్యాంకు బయట ఆమెపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో దివ్య అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మానస్ అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లి తన మొబైల్లో ఓ స్టేటస్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అందులో తన భార్య తనను మోసం చేస్తోందనే ఆరోపణతోనే ఆమెను హత్య చేసినట్లు పేర్కొన్నాడు. అనంతరం తన సోదరిని చంపి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన వాట్సాప్ స్టేటస్లో రాసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే కొందరి పేర్లను ప్రస్తావిస్తూ వారికి ఈ విషయాల గురించి తెలుసని పేర్కొన్నట్లు సమాచారం.
స్టేటస్ చూసిన పొరుగువారికి అనుమానం వచ్చింది. మానస్కు ఫోన్ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో వారు ఇంటికి వెళ్లారు. తలుపు తట్టినా ఎలాంటి స్పందన రాకపోవడంతో కొందరు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ మానస్, అతడి సోదరి సీమ మృతదేహాలు కనిపించాయి. ఇంట్లో టీవీ ఆన్లో ఉండటంతో పాటు హనుమాన్ చాలీసా ప్లే అవుతున్నట్లు చుట్టుపక్కల వాళ్లు తెలిపారు. మానస్కు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నాడని స్థానికులు చెబుతున్నారు.అయితే ఈ అంశంపై పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది. మానస్ తల్లిదండ్రులు ఇప్పటికే మృతి చెందారని, అనారోగ్యంతో ఉన్న సోదరి సీమ అతడితో కలిసి ఉంటున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. భార్య హత్యను ముందుగానే పథకం ప్రకారం చేశాడా? కుటుంబ వివాదమే కారణమా? మానస్ స్టేటస్లో చేసిన ఆరోపణల్లో వాస్తవం ఎంత? అనే కోణాల్లో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలను వెలికితీసేందుకు అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

