Lawyer M*urder: డబ్బు, ఆస్తుల ముందు బంధుత్వాలు బలాదూర్. అవును నేటి సమాజంలో డబ్బుకు తప్ప బంధువులకు బంధుత్వాలకు విలువ లేకుండా పోయింది. రంగారెడ్డి జిల్లాలో భూమి కోసం సొంత చెల్లెలినే కడతేర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగెకరాల భూమి కోసం నరకం చూపిస్తున్నాడు చెల్లిని తన అన్న. మూడేళ్ల నుంచి సొంత చెల్లెలిని ఆస్తి కోసం వేధిస్తున్నాడు. చివరికి.. భూమి కోసం ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఆస్తి కోసం సొంత అన్న.. సోదరిని అత్యంత దారుణంగా హత్య చేయించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లిలో సంచలనం సృష్టించింది.
మృతురాలి పేరు స్వప్న. చేవెళ్ల కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తోంది. ఆమెకు సోదరుడు రాజు ఉన్నాడు. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన న్యాయవాది స్వప్నకు, ఆమె సోదరుడు రాజుకు మధ్య గత కొద్ది రోజులుగా భూ వివాదం నడుస్తోంది. తల్లి వెంకటమ్మ తన 10 ఎకరాల భూమిని ఇద్దరు పిల్లలకు పంచింది. అందులో 6 ఎకరాలు రాజుకు, 4 ఎకరాలు స్వప్నకు రాసిచ్చింది. అయితే స్వప్నకు 4 ఎకరాలు పంచడం రాజుకు నచ్చలేదు. దీంతో కొంతకాలంగా కుటుంబంలో గొడవలు కొనసాగుతున్నాయి.
Child Hero Austin: మృత్యువుకు ఎదురీదిన చిన్నోడు.. కుటుంబాన్ని కాపాడుకున్న పెద్దోడు!
ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. రాజుపై స్వప్న రెండు సివిల్ కేసులు కూడా దాఖలు చేసింది. అవి ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉన్నాయి. ఇదే క్రమంలో స్వప్న తనకు కేటాయించిన 4 ఎకరాల్లో ఒక ఎకరాన్ని అమ్మేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న రాజు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. స్వప్న తన పొలానికి వెళ్లి భూమి సర్వే చేయిస్తున్న సమయంలో రాజు అక్కడికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో రాజు, అతనికి సహకరించిన మరో ముగ్గురు కలిసి స్వప్నపై కత్తులతో, కర్రలతో దాడి చేశారు. కత్తితో పొడిచి, బండరాయితో తలపై మోదడంతో స్వప్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆస్తి కోసం సోదరుడే ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం తెలిపారు. రాజుతో పాటు అతని డ్రైవర్ వీరేష్ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మరో వ్యక్తి గణేష్ పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు చెప్పారు. మొత్తం నాలుగు పోలీస్ బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని, ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.
IND vs AFG U19: అదేం కొట్టుడు స్వామి.. వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా!
ఈ హత్యపై న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వప్న హత్యను నిరసిస్తూ విధులను బాయ్కాట్ చేసిన న్యాయవాదులు, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్వప్న మృతిపై తల్లి వెంకటమ్మ కన్నీటిపర్యంతమైంది. గత మూడేళ్లుగా రాజు తన కూతురిని చంపాలని పథకం పన్నినట్లు తెలిపింది. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినట్లు వెల్లడించింది. ఈసారి భూమి సర్వే చేసి తిరిగి వస్తుండగా దారుణంగా హత్య చేశాడని పేర్కొంది. న్యాయవాది స్వప్న హత్యతో కేతిరెడ్డిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆస్తి కోసం సొంత సోదరుడే చెల్లెలిని పొట్టనపెట్టుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
