Site icon NTV Telugu

Kukatpally Suicide: కూకట్‌పల్లి ఆత్మహత్య కేసులో ట్విస్ట్‌.. వెలుగులోకి కీలక విషయాలు..

Kukatpalli

Kukatpalli

కూకట్‌పల్లి పరిధిలోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విగతజీవులుగా పడి ఉండటం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. స్రవంతి అనే మహిళ తన ఇద్దరు కుమారులను (12 ఏళ్లు , 10 ఏళ్లు) చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఇది ఆత్మహత్య కాదని, భర్త ప్రవీణ్ చేసిన పథకం ప్రకారమే ఈ దారుణం జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

స్రవంతికి, ప్రవీణ్‌కు 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, ప్రవీణ్ తన మేనత్త కూతురిని రెండో పెళ్లి చేసుకోవడంతో దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. మొదటి భార్యకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ప్రవీణ్ తల్లిదండ్రులు (స్రవంతి అత్తమామలు) కొంత స్థలాన్ని ఆమె పేరు మీద రాసిచ్చారు.

Mijia Smart IH Rice Doger P1 4L: షియోమి అద్భుతమైన కుక్కర్‌ విడుదల.. ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకు స్మార్ట్ సొల్యూషన్

కొంతకాలం తర్వాత ప్రవీణ్‌ను రెండో భార్య కూడా వదిలి వెళ్లడంతో, అతను తిరిగి స్రవంతికి దగ్గరయ్యాడు. అయితే, ఆమె పేరు మీద ఉన్న ఆస్తిని తిరిగి తన పేరు మీదకు మార్చాలని ప్రవీణ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో నిన్న రాత్రి కూడా పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగిందని, ఆ తర్వాతే ఈ ఘోరం జరిగిందని తెలుస్తోంది.

మృతదేహాలను చూసిన బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన వారి శరీర రంగు మారిపోయిందని, ప్రవీణే రాత్రిపూట ముగ్గురిని చంపి, ఉదయం ఏమీ ఎరుగనట్లు పనికి వెళ్లి, మధ్యాహ్నం వచ్చి డ్రామా ఆడుతున్నాడని వారు ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ వేధింపుల భరించలేక స్రవంతి ఈ నిర్ణయం తీసుకుందా లేక దీని వెనుక ప్రవీణ్ హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Exit mobile version