Crime: మాజీ భార్యను సంతోషపెట్టడానికి ఓ వ్యక్తి స్నేహితుడినే హత్య చేశాడు. మాజీ భార్యకు గిఫ్టులు కొనివ్వడానికి తన స్నేహితుడిని హత్య చేసి, అతడి వద్ద ఉన్న రూ. 2.5 లక్షల నగదు దొంగిలించాడు. రెండేళ్ల క్రితం విడిపోయిన భార్యకు గిఫ్ట్లు కొనివ్వడానికి ఈ డబ్బును ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Emirates Airlines : ప్రయాణికులకు రిలీఫ్..! మళ్లీ ప్రారంభమైన దుబాయ్ విమానాలు
చిక్కమంగళూర్ జిల్లాలోని బీరూర్ నివాసి అయిన నిందితుడు షఫీ, వృత్తిరీత్యా వెల్డర్. తన స్నేహితుడు పుట్టరాజును హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 19న ఒక ఫైనాన్స్ కంపెనీ నిర్వహించిన బంగారం వేలంలో పాల్గొంటానని చెప్పి పుట్టరాజును ప్రలోభపెట్టి షఫీ ఈ సంఘటన చేశాడని తెలుస్తోంది. అతన్ని నమ్మి పుట్టరాజు ఉదయం 11 గంటల ప్రాంతంలో దాదాపు 2.5 లక్షల నగదు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరాడు.
నిందితుడు పుట్టరాజును బైక్పై హొన్నవల్ల సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత నగదుతో పారిపోయాడు. హత్య తర్వాత రోజు రహదారిపై వెళ్తున్న పాల వ్యాపారి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు తర్వాత నిందితుడు షఫీ హత్య చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. హత్య తర్వాత షఫీ తన భార్యను అరసికెరెలోని ఒక లాడ్జిలో కలిశాడు. ఆమెకు రూ. 60,000 ఇచ్చాడు. పుట్టరాజు డబ్బులో ఆమెకు కొత్త టీవీ కొన్నాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. షఫీ, పుట్టరాజు మధ్య ఏడేళ్ల స్నేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
