Wife Kills Husband: రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఒక హత్య సంచలనం సృష్టించింది. ఇన్స్ట్రాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తితో ప్రేమలో పడిన మహిళ, తన భర్తను దారుణంగా కుట్ర పన్ని హత్య చేసింది. ఈ హత్యకు ఆమె ప్రియుడు సహకరించాడు. ఈ ఘటనలో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 4న బార్మర్ జిల్లాలోని మాల్పురా ఫాంటా సమీపంలోని ఓ పొలంలో ఉన్న నీటి ట్యాంకులో 42 ఏళ్ల తేజారామ్ మృతదేహం కనిపించింది. ఇది జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతుడి సోదరుడు మహేశ్వరం ఫిర్యాదు మేరకు, తేజారామ్ భార్య నేతల్, ఆమె ప్రియుడు గుమాన్ సింగ్లపై అనుమానం వ్యక్తం చేశారు. గుమాన్ సింగ్ టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నారు. ఇతడికి నేతల్తో వివాహేతర సంబంధం ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నేతల్కు ఇన్స్టాగ్రామ్లో 42 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరిద్దరి మధ్య ఇన్స్టా ద్వారా పరిచయం ఏర్పడి, ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీని గురించి తెలిసిన తేజారామ్, భార్యను పలుమార్లు మందలించాడు.
ఈ నేపథ్యంలోనే భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన ఇద్దరు మాస్టర్ ప్లాన్ వేశారు. జూన్ 2న నేతల్ తన భర్తకు ఫోన్ చేసి, తాను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని చెప్పింది. ఆందోళన చెందిన తేజారామ్ ఆమె కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ సమయంలో గుమాన్ సింగ్ అతడిని ధోరిమన్నాకు రమ్మని పిలిచి, అక్కడే తేజారామ్కు మద్యం తాగించి మత్తులోకి వెళ్లిన తర్వాత, మాల్పురా ఫాంటా సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నీళ్ల ట్యాంకులో పడేసి హత్య చేశాడు. మత్తులో ఉన్న తేజారామ్ నీటిలో మునిగి మరణించాడు.
హత్య తర్వాత తేజారామ్ మొబైల్ ఫోన్, బ్యాగ్ అక్కడే పడేసి ఇద్దరూ పరారయ్యారు. మృతుడి మొబైల్, కాల్ రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా పోలీసులు కేసును ఛేదించారు. భార్య నేతల్ను జ్యుడిషియల్ కస్టడీకి పంపగా, గుమాన్ సింగ్ ను పోలీస్ కస్టడీకి తరలించారు.

