కుటుంబ కలహాలు కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. మనస్పర్ధల కారణంగా దాంపత్యంలో అలజడి రేగుతోంది. ఒకరినొకరు చంపుకునే వరకు పరిస్థితులు వెళ్తున్నాయి. హైదరాబాద్లో తాజాగా కుటుంబ కలహాల కారణంగా.. ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను చంపేశాడు. అత్యంత దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. కూకట్పల్లిలో జరిగిన ఈ దారుణ ఘటనలో ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మహిళ పేరు సుమేరా. చాలా ఏళ్ల క్రితం రహీం అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఓ బాబు ఉన్నాడు. కూకట్పల్లి కైతలాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో కాపురం ఉంటున్నారు. రహీం క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం వరకు వారి కాపురం సజావుగానే సాగింది. కానీ ఈ మధ్య ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ వివాదాలు సైతం వారి కాపురంలో గొడవలకు కారణమయ్యాయి.
ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్యపై తీవ్ర ఆవేశానికి లోనైన రహీం.. అత్యంత దారుణంగా సుమేరాపై దాడి చేశాడు. సుమేరా గొంతు కోసి హత్య చేశాడు. భార్య చనిపోవడంతో.. ఏం చేయాలో తోచని.. రహీం.. ఇంట్లో నుంచి పారిపోయాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి చూసే సరికి సుమేరా రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించారు. పోస్ట్మార్టం పూర్తి చేయించి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
సుమేరా తల్లిదండ్రులు, బంధువుల ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న రహీంను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్లతో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వారిద్దరి మధ్య కుటుంబ కలహాల కారణంగానే హత్య చేసి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉందా అనే కోణంలోనూ పరిశీలిస్తున్నామని తెలిపారు. సుమేరాను అత్యంత దారుణంగా హత్య చేసిన రహీంను కఠినంగా శిక్షించాలని ఆమె బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
