Site icon NTV Telugu

Gangavaram SI Bribe Case :కౌన్సిలింగ్ పేరుతో లంచం డిమాండ్.. ఎస్సై అరెస్ట్

Bribe

Bribe

కంచె చేను మేస్తుందనే సామెత గుర్తుందా? పోలవరం జిల్లాలోని గంగవరం పోలీసులకు ఈ సామెత సరిగ్గా వర్తిస్తుంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఏకంగా ఓ ఎస్సై, కానిస్టేబుల్ దొరికిపోవడం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన రంపచోడవరం డివిజన్‌లో గంగవరం పోలీస్ స్టేషన్‌లో పోలీసుల అవినీతి బాగోతం వెలుగు చూసింది..

ఓ వివాహేతర సంబంధం కేసులో గంగవరం స్టేషన్ ఎస్సై, కానిస్టేబుల్ లంచం డబ్బులు తీసుకుని అడ్డంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికిపోయారు.. గంగవరం మండలం నెల్లిపూడి గ్రామానికి చెందిన అనార్కలి అనే యువతితో దాసరి శివకుమార్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అతని మొదటి భార్య గంగవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా ఎస్సై వెంకటేష్ ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సమయంలో కేసు విషయాన్ని సర్దుబాటు చేయాలంటే 20 వేల రూపాయిలు లంచంగా ఇవ్వాలని ఎస్సై వెంకటేష్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఐతే శివ కుమార్.. డబ్బు ఇచ్చుకునేందుకు నిరాకరించాడు. దీంతో ఎస్సై వెంకటేష్‌ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. లేని పక్షంలో కేసును కఠినంగా నమోదు చేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Amazon & Flipkart లో రచ్చ.! Moto G57 Power పై భారీ డిస్కౌంట్.!

అంతేకాక.. నగదు తన చేతికి అందేంత వరకు శివకుమార్ సెల్‌ఫోన్‌ను తన వద్దనే ఉంచుకున్నట్లు బాధితుడు తెలిపారు. న్యాయం చేయాల్సిన ఎస్సై… డబ్బు డిమాండ్‌పై విసిగిపోయిన శివకుమార్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ డీఎస్పీ డాక్టర్ కిషోర్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ట్రాప్ ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేసింది…

ఏసీబీ అధికారులు ముందుగా సాక్షుల సమక్షంలో నగదు నోట్లపై రసాయన పౌడర్ పూసి బాధితుడికి అందించారు. గంగవరం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ముందుగా ప్లాన్ చేసిన విధంగా శివకుమార్ కానిస్టేబుల్ వీరబాబుకు 15,000 రూపాయాలు నగదు అందజేశాడు. నగదు స్వీకరించిన వెంటనే అక్కడే గస్తీ కాస్తున్న ఏసీబీ అధికారులు దాడి చేసి కానిస్టేబుల్ వీరబాబును అదుపులోకి తీసుకున్నారు. రసాయన పరీక్షల్లో ఈయన చేతులకు పౌడర్ ఆనవాళ్లు బయటపడినట్లు అధికారులు గుర్తించారు. విచారణలో, ఎస్సై వెంకటేష్ సూచన మేరకు తాను డబ్బు తీసుకున్నట్లు కానిస్టేబుల్ వీరబాబు వెల్లడించారు..

అనంతరం ఎస్సై వెంకటేష్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. డబ్బు డిమాండ్ చేసిన ఆధారాలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే లంచం వ్యవహారంలో చిక్కుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వివాహేతర సంబంధం కేసును సర్దుబాటు పేరుతో డబ్బులు డిమాండ్ చేయడం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని ఒత్తిడి తేవడం వంటి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి…

Alexei Navalny: కప్ప విషంతో అలెక్సీ నావల్నీ హత్య.. రష్యాపై సంచలన ఆరోపణలు..

Exit mobile version