మనిషిని పోలిన మనుషులు ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు ఉంటారని చెబుతుంటారు.. అక్కడక్కడ కొందరినీ చూస్తుంటాం.. ఇంకా కొందరు కొన్ని పోలికలున్నా.. ప్రముఖులైనవారిని వేషధారణలో కనిపిస్తూ ఉంటారు.. అంత వరకు బాగానే ఉంటుంది.. కానీ, అదే అదునుగా భావించి మోసాలకు పాల్పడితే.. చట్టం తన పని తాను చేసుకుపోతోంది.. ఓ వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి వేషధారణలో కనిపిస్తున్నాడు.. ప్రజల్లో తిరిగేస్తున్నాడు.. ఫొటోలు దిగుతున్నాడు.. ఆటో గ్రాఫ్లు ఇచ్చేస్తున్నాడు.. ఇది సీఎంకే ఇబ్బంది తెచ్చిపెట్టేలా మారింది.. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ డూప్లికేట్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు.. మహారాష్ట్రలో జరిగిన సీఎం.. డూప్లికేట్ సీఎంకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: Chiranjeevi: మళ్లీ రాజకీయాల్లోకి చిరు.. దూరం కాలేదు అంటూ ట్వీట్
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వేషధారణలో ప్రజలను మోసం చేసిన పుణెకు చెందిన విజయ్ మానే అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేలా కనిపించి, ఆయన తరహాలోనే వేషధారణలో విజయ్ మానే బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ.. సీఎంగా చెప్పుకుంటున్నాడు.. ఈ మధ్య విజయ్ మానే.. పాత నేరస్థుడు శరద్ మోహోల్తో కలిసి ఫొటోలు దిగాడు.. అయితే, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి.. దీంతో, అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి వేషధారణతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన అతడిపై ఐపీసీ 419-511, 469, 500, 501 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేశారు. గూండా శరద్ మోహోల్తో కలిసి ఫోటో తీసి వైరల్ చేయడంతో.. సీఎం ఏక్నాథ్ షిండే పరువు తీశారని విజయ్ మానెపై అభియోగాలు మోపారు.
అయితే, విజయ్ మానే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇది పౌరుల మధ్య అపార్థానికి దారితీస్తుంది. ఈ వ్యవహారంలో విజయ్ మానెపై ఫిర్యాదు నమోదైంది. అందులో ‘విజయ్ మనే ఎప్పుడూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే లాగా డ్రెస్లు వేసుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. పబ్లిక్ ప్లేస్కి వెళ్తూ జనం అపార్థం చేసుకునేలా ప్రవర్తించేవాడు. విజయ్ మానె ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి షిండే ప్రతిష్టను దిగజార్చుతోందని ఫిర్యాదు అందింది.. దీంతో, కేసు నమోదు చేయడం.. అరెస్ట్ చేయడం జరిగిపోయాయి. కాగా, శివసేనలో తిరుగుబాటు జెండా ఎత్తిన ఏక్నాథ్ షిండే.. మహావికాస్ అఘాడి ప్రభుత్వాన్ని కూల్చివేశారు.. ఆ తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. తానే ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే..
