Gym trainer Murder: ఢిల్లీలో జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘాల్(29) హత్య సంచలనంగా మారింది. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటల మీద ఉండాల్సిన వరుడు హత్యకు గురయ్యాడు. గౌరవ్ సింఘాల్ని అతని తంండ్రి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలిసింది. తండ్రి రంగలాల్ హత్య చేశాడని, అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గౌరవ్ తనను రోజూ తిడుతుండే వాడనే కోపంతో రంగలాల్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలో గౌరవ్ అతడి ఇంట్లో అర్థరాత్రి హత్యకు గురయ్యాడు. తెల్లవారితే అతడి పెళ్లి. ఈ సమయంలోనే తండ్రి చేతిలో హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. హత్య తర్వాత పరారీలో ఉన్న నిందితుడు రంగలాల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారు, వారి కోసం గాలిస్తున్నారు.
Read Also: Inter Student: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
గురువారం అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో పోలీసులకు హత్య గురించి ఫోన్ వచ్చింది. సంఘటనా స్థలంలోకి వెళ్లే సరికి రక్తపుమడుగులో బాధితుడు పడి ఉన్నాడు. అతడి ముఖం, ఛాతిపై 15 కత్తిపోట్లు ఉన్నాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినప్పటికీ, ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. హత్య తర్వాత మృతదేహాన్ని దాచేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
గౌరవ్ పెళ్లి వేడుకు గురువారం జరగాల్సి ఉంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే గౌరవ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ, కుటుంబ సభ్యుల ఒత్తిడితో పెళ్లికి అంగీకరించాడనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ విషయమై గౌరవ్ తన తండ్రితో పలుమార్లు వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే గౌరవ్ తన తండ్రిని చెప్పుతో కొట్టాడని తెలుస్తోంది. దీంతో కోపోద్రిక్తుడైన రంగలాల్ తన ముగ్గురు సహచరులతో కలిసి గౌరవ్ని హత్య చేసి రూ. 50 లక్షల నగదు, రూ. 15 లక్షల విలువైన బంగారంతో ఇంటి నుంచి పారిపోయినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.
