NTV Telugu Site icon

Threat Call to SBI: లోన్‌ ఇవ్వకుంటే బ్యాంక్‌ను పేల్చేస్తా.. చైర్మన్‌ను లేపేస్తా..!

Threat Call

Threat Call

బడా బడా బాబుల సంగతి ఏంటో గానీ.. సాధారణ వ్యక్తులు లోన్‌ అడిగితే మాత్రం.. బ్యాంకులు.. ఆ పేపర్‌.. ఈ పేపర్‌ పేర్లతో తమ చుట్టూ తిప్పుకున్న సందర్భాలు అనేకం.. అయితే, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌కి వచ్చిన ఫోన్‌ కాల్ తీవ్ర కలకలం రేపుతోంది.. తనకు లోన్ మంజూరు చేయకపోతే బ్యాంక్ శాఖను పేల్చేస్తా.. బ్యాంక్‌ ఛైర్మన్‌నే కిడ్నాప్‌ చేసి చంపేస్తానంటూ ఫోన్‌ చేసి మరీ హెచ్చరించాడు.. తాను రూ. పది లక్షల రూపాయల లోన్ కోసం ఇప్పటికే ఓసారి అభ్యర్థన పెట్టుకుంటే తిరస్కరించారని.. కానీ, ఈసారి కూడా అదే జరిగితే.. ఎస్బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారాను కిడ్నాప్‌ చేసి లేపేస్తానంటూ బెదిరించాడు.

Read Also: Minister Vidadala Rajini: మంత్రులందరి కార్లపై దాడులు.. పవన్‌ కల్యాణే సమాధానం చెప్పాలి..!

ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గురువారం రోజు ఉదయం 11 గంటలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దక్షిణ ముంబై కార్యాలయానికి ఓ వ్యక్తి ఫోన్ చేసి, రూ. 10 లక్షల రుణం మంజూరు చేయకపోతే బ్యాంక్ ఛైర్మన్‌ను కిడ్నాప్ చేసి హత్య చేస్తానని మరియు దాని కార్యాలయాన్ని కూడా పేల్చేస్తానని బెదిరించాడని పోలీసు అధికారి ఇవాళ తెలిపారు.. నారీమన్ పాయింట్‌లో ఉన్న బ్యాంకు శాఖకు ఈ బెదిరింపు కాల్‌ వచ్చిందని.. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి తన పేరు మహ్మద్‌ జియా ఉల్‌ అలీగా పేర్కొని.. పాకిస్థాన్ నుంచి కాల్ చేస్తున్నట్లు బెదిరించారని బ్యాంక్‌ అధికారి తెలిపారు.. ఇక, బ్యాంక్‌ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఆ బెదిరింపు కాల్ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్లు తేల్చారు. మరియు నిందితుడిని పట్టుకోవడానికి ముంబై పోలీసుల బృందం బెంగాల్‌కు బయల్దేరినట్టు వెల్లడించారు.

ఫోన్ చేసిన వ్యక్తి తనను మహ్మద్ జియా ఉల్ అలీగా పరిచయం చేసుకున్నాడని, తనకు రూ.10 లక్షల రుణం మంజూరు చేయాలని బ్యాంక్ ఆఫీస్ అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్ అజయ్‌కుమార్ శ్రీవాస్తవ్ గురువారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్బీఐ చైర్మన్‌ని కిడ్నాప్ చేసి హత్య చేస్తానని, రుణం మంజూరు చేయకపోతే బ్యాంకు కార్పొరేట్ కార్యాలయాన్ని బాంబుతో పేల్చేస్తానని కాలర్ బెదిరించాడు అని తెలిపారు. బెదిరింపు కాల్ తర్వాత, శ్రీవాస్తవ్ దక్షిణ ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశాడు, ఆ తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 506 (2) (నేరపూరిత బెదిరింపు) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.. మొత్తంగా లోన్‌ ఇవ్వకపోతే.. బ్యాంక్‌ పేల్చేస్తాం.. చైర్మన్‌ను లేపేస్తాం అంటూ బెదిరింపులకు దిగడం చర్చగా మారింది.