యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ హఠాన్మరణం ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. తొలుత పొలిటికల్ మర్డర్ అని భావించారు. కానీ చివరికి ఆర్ధిక లావాదేవీలే అతని ప్రాణం తీశాయని నిర్ధారణ అయింది. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇంతకీ బొగ్గుల శ్రీనివాస్ను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారా? ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లో కారు ప్రమాదంలో మృతి చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ది హత్యగా తేల్చారు పోలీసులు. ఈ హత్య కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని నిర్ధారణకు వచ్చారు….
ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలో ఫిబ్రవరి 14న ఓ కారు పడి ఉన్నట్లు స్థానిక జాలర్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు దూకి పారిపోయినట్టు అక్కడి మత్స్యకారులు తెలిపారు. కారును బయటకు తీసి చూడగా అందులో శ్రీనివాస్ మృతదేహం లభించింది. ఆయన్ను యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్గా గుర్తించారు పోలీసులు. అతను గతంలో పవన్ కళ్యాణ్ హఠావో- పాలిటిక్స్ బచావో అనే పుస్తకం రచించి రిలీజ్ చేశారు. ఆ పుస్తకం దాదాపు 8 లక్షల కాపీలు అమ్ముడుపోయింది. దీంతో ఆయన ఫేమస్ అయ్యారు…
మరోవైపు ఆయన డెడ్బాడీకి సంబంధించి తలపై గాయాలు ఉండడంతో ప్రమాదం కాదు.. హత్యగా పోలీసులు అనుమానించారు. అతని మృతిపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా ఇది హత్యేనని అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. వారం రోజుల్లోనే కేసులో పురోగతి సాధించారు. చివరికి మర్డర్ వెనుక మిస్టరీని ఛేదించారు.. నంద్యాల జిల్లాకు చెందిన బొగ్గుల శ్రీనివాస్ గత 20 ఏళ్లుగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. బొగ్గుల శ్రీనివాస్కు వ్యాపార ఆర్థిక వ్యవహారాలపై వివాదాలు కొనసాగుతున్నాయి. కొన్ని లావాదేవీల కోసం తన జీఎస్టీ ఖాతాను వాడుకునేందుకు శ్రీనివాస్.. మాధవరెడ్డికి అనుమతి ఇచ్చారు. అయితే జీఎస్టీ బకాయిల విషయంలో అధికారుల నుంచి శ్రీనివాస్కు నోటీసులు రావడంతో ఒప్పందం ప్రకారం ఆ డబ్బు చెల్లించాలని మాధవరెడ్డిపై శ్రీనివాస్ ఒత్తిడి పెంచారు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని మాధవరెడ్డి నిర్ణయించుకుని కిరాయి హంతకులను రంగంలోకి దించాడు. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకొని నిందితులు హత్యకు పథకం రచించారు..
అంతకు ముందే రెడీ చేసుకున్న ప్లాన్ ప్రకారం మాధవరెడ్డి.. విజయవాడలో పెండింగ్లో ఉన్న బకాయి డబ్బులు ఇస్తామని నమ్మబలికాడు. మరో ముగ్గురితో కలిసి శ్రీనివాస్ను ఈ నెల 13న కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. నార్కట్ పల్లి వద్ద శ్రీనివాస్ను కారులోనే కత్తులు, ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేశారు.ఆ తర్వాత నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు మృతదేహంతో సహా కారును పాలేరు జలాశయంలోకి తోసేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు… ఈ కేసులో పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలు, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించి నిందితులు పోకల కోటేశ్వరరావు, షేక్ అబ్దుల్ హఫీజ్, ఎండీ హజ్మత్ అలీ ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించడంతో ఈ కేసులో ఏ1గా మేకల వేణుమాధవ్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో హత్య వెనుక ఆర్ధిక లావాదేవీలే అసలు కారణమని పోలీసులు గుర్తించారు. బొగ్గుల శ్రీనివాస్ను చంపేందుకు నిందితులకు రూ.5 లక్షల సుపారీ ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు… ముందుగా పొలిటికల్ మర్డర్ అని అందరూ భావించినప్పటికీ.. చివరికి ఆర్ధిక లావాదేవీల వల్లే బొగ్గుల శ్రీనివాస్ను మట్టుబెట్టారని పోలీసులు చెబుతున్నారు..