NTV Telugu Site icon

Bengaluru: పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన అక్రమ సంబంధం.. ఏం జరిగిందంటే..!

Bengalurusucide

Bengalurusucide

పచ్చని సంసారంలో అక్రమ సంబంధం అగ్గిరాజేసింది. కుటుంబాన్ని ముక్కలు చేసింది. మనస్తాపంతో వివాహిత అర్ధాంతరంగా తనువు చాలించింది. ఈ దారుణం బెంగళూరులో చోటుచేసుకుంది.

మానస (25).. దిలీప్‌ అనే యువకుడ్ని ఆరేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ఈ దంపతుల దాంపత్యానికి గురుతుగా ఐదేళ్ల కుమార్తె ఉంది. సాఫీగా సాగిపోతున్న ఫ్యామిలీలోకి మరో మహిళ ఎంట్రీ ఇచ్చింది. అంతే పచ్చని సంసారంలో అగ్గిరాజేసింది. ఇంకేముంది నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఏడాదిన్నర నుంచి దిలీప్.. మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయంలో నిత్యం భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే గత అర్ధరాత్రి బెంగళూరులోని బ్యాదరహళ్లిలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మానస ప్రాణాలు తీసుకుంది. అయితే ఆత్మహత్యకు ముందు మొబైల్‌లో వీడియో ఆన్ చేసి.. తన గోడు వెళ్లబుచ్చుకుంది. భర్త అక్రమ సంబంధం కారణంగా ప్రాణాలు తీసుకుంటున్నట్లు వాపోయింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న కూడా.. ఒక్క నిమిషం ఆగి మొబైల్ ఆఫ్ చేసి తనువు చాలించింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త అక్రమ సంబంధంతోనే మానస ప్రాణాలు తీసుకుందని పోలీసులు చెప్పారు. ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయని.. దీంతో మానస బలవన్మరణానికి పాల్పడిందని పేర్కొన్నారు. మానసను ఆస్పత్రికి తీసికెళ్లేలోపే ప్రాణాలు వదిలిందని చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇటీవల బెంగళూరులో ఒక హాస్టల్‌లోకి అర్ధరాత్రి యువకుడు ప్రవేశించి అత్యంత దారుణంగా యువతిని చంపేశాడు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం స‌ృష్టించింది. నిందితుడ్ని మధ్యప్రదేశ్‌లో అరెస్ట్ చేశారు.