Mule Account Scam : సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్స్ (Mule Accounts) సప్లై చేస్తూ అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న ఒక ముఠా గుట్టును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ గారు ప్రెస్మీట్లో వెల్లడించారు. సైబర్ ఫ్రాడ్స్ చేయడానికి నేరగాళ్లకు ఏకంగా 33 ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ సప్లై చేసిన దిలీప్ సింగ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అక్రమ దందాలో ప్రైవేట్ బ్యాంక్ అధికారుల హస్తం కూడా ఉండటం ఇప్పుడు కలకలం రేపుతోంది.
నిందితుడు దిలీప్ సింగ్ ఈజీ మనీ కోసం మ్యూల్ ఖాతాలను ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన ఎస్ బ్యాంక్ (Yes Bank), కోటాక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) లకి చెందిన కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. నిందితుడు దిలీప్ సింగ్ ఈ అకౌంట్లన్నింటినీ విదేశాల్లో లేదా మరెక్కడో దాక్కుని ఆపరేట్ చేస్తున్న జోర్డాన్, పింటు భాయ్ అనే ప్రధాన సైబర్ నేరగాళ్లకు సప్లై చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ జోర్డాన్, పింటు భాయ్ ఇద్దరూ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
ఈ ముఠా ముఖ్యంగా అమాయక స్టూడెంట్స్, చిన్న చిన్న వ్యాపారులు, రోజువారీ లేబర్ వర్క్ చేసుకునే వారిని టార్గెట్ చేస్తోంది. వారికి కొద్దిగా డబ్బు ఆశ చూపి, వారి ఆధార్, పాన్ కార్డు వివరాలతో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తున్నారు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల డిమాండ్ను బట్టి ఒక్కో అకౌంట్ను భారీ ధరలకు అమ్ముకుంటున్నారు. ఈ అకౌంట్ల ద్వారానే కోట్లాది రూపాయల సైబర్ మోసాల డబ్బు చేతులు మారుతోంది. ఈ లూప్ను బ్రేక్ చేయడానికి నిందితుడికి చెందిన 23 బ్యాంక్ అకౌంట్స్ను తక్షణమే ఫ్రీజ్ చేయాల్సిందిగా ఇప్పటికే బ్యాంక్ అధికారులను కోరినట్లు డీసీపీ సాయి మనోహర్ వెల్లడించారు.
ఆన్లైన్లో పరిచయమైన జోర్డాన్, పింటు భాయ్ లతో చేతులు కలిపి దిలీప్ సింగ్ ఈ ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. ఈ సందర్భంగా ప్రజలకు డీసీపీ సాయి మనోహర్ గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. “కొద్దిపాటి డబ్బు ఆశతో మీ బ్యాంక్ ఖాతాలను ఇతరులకు అమ్ముకుంటే, మీ జీవితాన్ని మీరే చేతులారా అమ్ముకున్నట్లే. ఇలాంటి ఇల్లీగల్ అకౌంట్ల ద్వారా సైబర్ నేరాలు జరిగితే, అసలు ఖాతాదారులు ఎంతటి అమాయకులైనా సరే పోలీస్ విచారణ , జైలు శిక్ష ఎదుర్కోక తప్పదు” అని ఆయన స్పష్టం చేశారు.
