Site icon NTV Telugu

Snake Bite : విషసర్పాల కోరల్లో విద్యార్థుల ప్రాణాలు.. తప్పెవరిది..?

Another Student Passes Away for Snake Bite at Keesara BC Hostel.

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ పిల్లల ప్రాణాలు పోతే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత తల్లడిల్లిపోతుంది. ఉన్నత చదువులు చదువుకొని ప్రయోజకుడిగా వస్తాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు వారి పిల్లలు విగతజీవులుగా దరిచేరుతున్నారు. మొన్నటికి మొన్న ఏపీలోని విజయనగరం జిల్లా కురుపాంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనను మరవకముందే మరో ఘటన తెలంగాణలో జరగడం దురదృష్ణకరం. ఇటీవల జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ వసతి గృహంలో అర్ధరాత్రి తమ గదిలో నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థులకు పాము కాటు వేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్ధి మరణించాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఎంతగానో శ్రమించి వారి ప్రాణాలు రక్షించారు. అయితే తాజాగా కీసరలోని బోగరం బీసీ హాస్టల్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

నిన్న రాత్రి కీసరలోని బోగరం బీసీ హస్టల్‌లో ఎనిమిదో తరగతి విద్యార్థి శివ శంకర్ (13)ను పాము కాటువేయడంతో మృతి చెందాడు. మృతుడి స్వస్థలం వికారాబాద్‌ జిల్లాలోని మర్పల్లి మండలం కొమిశెట్టి పల్లి గ్రామం అని అధికారులు తెలిపారు. అయితే గాంధీ హాస్పిటల్ లో విద్యార్థి మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు. ఇలా విద్యార్థులు విషసర్పాల కోరలకు బలవుతుంటే.. ఆ విద్యార్థుల తల్లిదండ్రుల బాధ అధికారులు, ప్రజాప్రతినిధులకు అర్థం కావడం లేదా అని స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మరోమారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

https://ntvtelugu.com/fake-messages-in-the-name-of-collector-suryakumari/
Exit mobile version