మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో వెలుగుచూసిన ఘోరమైన లైంగిక వేధింపుల ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో బాధితురాలైన ఒక మైనర్ బాలిక సోమవారం వాజర్ డ్యామ్ వద్దకు చేరుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. అయితే.. అప్రమత్తమైన పోలీసులు సకాలంలో స్పందించి ఆమెను అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
అమరావతి జిల్లా పరత్వారా నగరానికి చెందిన మహ్మద్ అయ్యాజ్ (అలియాస్ తన్వీర్) అనే 19 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి ప్రధాన సూత్రధారి. ప్రేమ పేరుతో అమాయక బాలికలను వలలో వేసుకోవడం (లవ్ ట్రాప్), వారితో అసభ్యకర వీడియోలు చిత్రీకరించడం, ఆపై వాటితో బ్లాక్ మెయిల్ చేస్తూ వ్యభిచార కూపంలోకి దించడమే ఇతని పని. ఒక బ్రేకప్ తర్వాత తాను ‘ప్లేబాయ్’ ఇమేజ్ కోసం ఇలాంటి పనులకు ఒడిగట్టినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. వాట్సాప్, స్నాప్చాట్ గ్రూపుల ద్వారా బాలికలను సంప్రదించి, స్నేహితుడి గదిని వాడుకుంటూ ఈ అకృత్యాలకు పాల్పడేవాడు.
కేసు వెలుగులోకి వచ్చిందిలా..
అయ్యాజ్, అతని చిన్ననాటి స్నేహితుడు ఉజైర్ ఖాన్ మధ్య వచ్చిన గొడవతో ఈ రాకెట్ బయటపడింది. అయ్యాజ్ తన ఫోన్ను ఒక చోట మరిచిపోగా, ఉజైర్ ఆ ఫోన్లోని అశ్లీల వీడియోలు, ఫోటోలను ఆన్లైన్లో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో ఎనిమిది మంది బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read:Fire Accident: 24 గంటల తర్వాత మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం..
ఈ కేసులో ఇప్పటివరకు అయ్యాజ్, ఉజైర్ ఖాన్తో సహా ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ల్యాప్టాప్, హార్డ్ డిస్క్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నాగపూర్కు చెందిన 15 ఏళ్ల బాలిక స్టేట్మెంట్ను పోలీసులు నమోదు చేశారు. అలాగే మరో మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఉజైర్ ఖాన్పై పోక్సో (POCSO) చట్టం కింద అదనపు కేసు నమోదైంది.
ఈ ఉదంతం రాజకీయ రంగు పులుముకుంది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య పరత్వారాను సందర్శించి, ఎస్.ఐ.టి (SIT) చీఫ్ శుభమ్ కుమార్ను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు అయ్యాజ్ ఏప్రిల్ 21 వరకు పోలీస్ కస్టడీలో ఉంటాడు. బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయడానికి గల కారణాలు నేరుగా ఈ కేసుతోనే ముడిపడి ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రభుత్వం, పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
