Tata Motors: టాటా గ్రూప్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ‘టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్’ (Tata Motors PV) షేర్లు బుధవారం ట్రేడింగ్లో ఘోరంగా నష్టపోయాయి. ఇంట్రాడేలో ఏకంగా 10 శాతం వరకు పతనమైన షేరు విలువ రూ.355 దిగువకు పడిపోయింది. దీంతో నిఫ్టీ-50 సూచీలోనే అత్యధికంగా నష్టపోయిన టాప్ లూజర్గా టాటా మోటార్స్ నిలిచింది. మార్కెట్ ముగిసే సమయానికి కొంత కోలుకున్నప్పటికీ, అంతిమంగా 8.30% క్షీణతతో రూ.360 వద్ద స్థిరపడింది. ఈ ఒకే ఒక్క రోజు పతనంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (Market Cap) భారీగా తగ్గి రూ.1.45 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ ఎఫెక్ట్ కంపెనీ కమర్షియల్ వెహికల్ యూనిట్ షేర్లపై కూడా స్పష్టంగా కనిపించింది.
అసలు ఎందుకు ఈ పతనం..
టాటా మోటార్స్కు చెందిన ప్రతిష్టాత్మక లగ్జరీ కార్ల సంస్థ ‘జగువార్ ల్యాండ్ రోవర్’ (JLR) రిలీస్ చేసిన కొత్త బిజినెస్ అప్డేట్ ప్రణాళికలే ఈ నష్టాలకు ప్రధాన కారణం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక సంవత్సరం 2027 (FY27) కు సంబంధించి జేఎల్ఆర్ ప్రకటించిన అవుట్లుక్ ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ కంపెనీ FY27లో కేవలం 13 శాతం ఆదాయ వృద్ధిని, 4 శాతం ఎబిటా (EBITDA) మార్జిన్ను మాత్రమే అంచనా వేసింది. FY26లో మైనస్ 2.3 బిలియన్ పౌండ్లుగా ఉన్న ఆపరేషనల్ క్యాష్ ఫ్లో, FY27 నాటికి కేవలం బ్రేక్-ఈవెన్ (సమాన స్థాయికి) అవుతుందని పేర్కొంది. జేఎల్ఆర్ నిర్దేశించుకున్న ఈ బలహీనమైన టార్గెట్స్ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల దెబ్బ కూడా..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త టారిఫ్ల (సుంకాల) విధానం జేఎల్ఆర్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఒత్తిడిని పెంచినట్లు కంపెనీ అంగీకరించింది. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న ‘డిఫెండర్’, ‘రేంజ్ రోవర్’ వంటి లగ్జరీ ఎస్యూవీలకు అక్కడ స్థానిక తయారీ యూనిట్లు (Local Manufacturing Units) లేకపోవడం కంపెనీకి పెద్ద మైనస్గా మారింది. బ్రిటన్ లేదా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల టారిఫ్ల భారం పెరిగి లాభాల మార్జిన్ తగ్గుతోందని సమాచారం.
జేఎల్ఆర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఇవే..
బాహ్య సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ మిడ్-టర్మ్లో డబుల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు జేఎల్ఆర్ తెలిపింది. ఇందుకోసం FY29 నాటికి 18 బిలియన్ పౌండ్ల పెట్టుబడి పెట్టాలనే ఐదేళ్ల కట్టుబాట్లను కంపెనీ రీఅఫర్మ్ చేసింది. అలాగే అమెరికా మార్కెట్లో తన పట్టును మరింత పెంచుకోవడానికి పాపులర్ ‘డిఫెండర్’ (Defender) బ్రాండ్పైనే ఎక్కువగా దృష్టి పెట్టనుంది. ‘జగువార్ న్యూ లగ్జరీ 4-డోర్ GT-Type 01’ మోడల్ను ఈ ఏడాది చివరలో లాంచ్ చేయనున్నారు. భవిష్యత్తులో అత్యంత సామర్థ్యం ఉన్న మార్కెట్లుగా భావిస్తున్న భారత్, పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) దేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్, గ్రోత్ను కొనసాగిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఖర్చులను తగ్గించుకుంటూ, మరిన్ని ప్రీమియం కార్లను మార్కెట్లోకి తెచ్చి మార్జిన్లను కాపాడుకోవడానికి జేఎల్ఆర్ ప్రయత్నిస్తోంది.

