వాట్సాప్ అమలులోకి తెచ్చిన కొత్త ప్రైవసీ పాలసీకి కేంద్ర ప్రభుత్వం నో చెప్పిన సంగతి తెలిసిందే.. కొత్త ప్రైవసీ పాలసీలను ఉపసంహరించుకోవాలని వాట్సాప్ను కేంద్రం ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.. ఈ మేరకు ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాట్సాప్కు లేఖను రాసింది.. అయితే, కేంద్రం లేఖపై వాట్సాప్ స్పందించింది.. వినియోగదారుల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వాట్సాప్ పేర్కొంది.. ఒక ప్రకటనను విడుదల చేసిన వాట్సాప్.. భారత ప్రభుత్వం పంపిన లేఖపై స్పందించామని, యూజర్ల గోప్యతే మాకు ప్రధానమని హామీ ఇచ్చింది. కొత్త ప్రైవసీ పాలసీతో యూజర్ల వ్యక్తిగత సందేశాల గోప్యతకు భంగం కలుగదని, రాబోయే రోజుల్లో వాట్సాప్ కార్యాచరణలో ఏ మార్పులుండవని తెలిపింది. అయితే, వినియోగదారులకు ప్రైవసీ పాలసీపై అప్డేట్ను ఇస్తూనే ఉంటామని తెలిపింది.. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం అమల్లోకి వచ్చేంతవరకు వాట్సాప్ అకౌంట్లు, ఫీచర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని క్లారిటీ ఇచ్చింది వాట్సాప్. ఇక, కొత్త ప్రైవసీ పాలసీని ఇంకా ఆమోదించని యూజర్ల అకౌంట్లు కూడా ఎప్పటిలాగే పనిచేస్తాయని తెలిపింది వాట్సాప్.